Shreyas Iyer Faking Back Pain Issue: క్రికెటర్లను భారతీయులు ప్రేమిస్తారు.. ఆరాధిస్తారు.. చాలామంది వారిని అనుకరిస్తారు. వారిలాగే క్రికెటర్లు కావాలని కలలు కంటారు. అలా సచిన్ టెండుల్కర్ని చూసి ఇన్స్పైర్ అయిన క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ లాంటివారెందరో ఉన్నారు. అలాగే సచిన్ పేరు పెట్టుకున్న క్రికెటర్లు కూడా ఉన్నారు.
అందుకనే టీమ్ ఇండియాలో ఆడే క్రికెటర్లు బయట కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకరిద్దరు తప్ప చాలామంది ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. కానీ కొత్తగా వస్తున్న యువతరం వీటిని పట్టించుకోవడం లేదు. ఆ ఏమైతే అయ్యిందిలే అన్న ధోరణిలో సాగుతున్నాయి.
అందుకు తాజా ఉదాహరణగా ఇషాన్ కిషన్ని చెప్పాలి. నాకు మెంటల్గా బాగాలేదని చెప్పి, సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన మనిషి మళ్లీ ఒకట్రెండు సార్లు తప్ప కనిపించలేదు. ఈ విషయంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. దేశవాళీ క్రికెట్లో ఆడకపోతే ఐపీఎల్లో ఆడే అవకాశాలు ఉండవని తేల్చి చెప్పింది. అయినా సరే, ఇషాన్ లెక్క చేయలేదు.
ఇప్పుడదే దారిలో శ్రేయాస్ కూడా నడుస్తున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇక్కట్లలో పడిన తను ఇంగ్లాండ్తో జరిగిన మూడు టెస్టుల్లో అతి దారుణంగా ఆడాడు. దీంతో తనంతట తానే, తనకు వెన్నునొప్పి ఉందని చెప్పి వెళ్లిపోయాడు. సరే, అనారోగ్యం ఉన్నవాడు ఎన్సీఏకి వెళ్లి చూపించుకోవల్సి ఉంటుంది. వాళ్లు ఫిట్ అని చెబితేనే మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఉంటుంది. లేదంటే ఎంత గొప్ప ఆటగాళ్లయినా బయట కూర్చోవల్సిందే.
Read More: రాంచీలో రికార్డులు తిరగ రాస్తారా?
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీల పరిస్థితి అలాగే ఉంది. వారిని చూసైనా వీరు నేర్చుకోకపోతే ఎలా..? అని సీనియర్లు సీరియస్ అవుతున్నారు. ఇంతకీ శ్రేయాస్ ఏం చేశాడు..? వెన్నునొప్పి అని ఎన్సీఏకి వెళ్లాడు. అక్కడదేం లేదు, ఫిట్గానే ఉన్నాడని చెప్పారు.
అయితే శుక్రవారం నుంచి బరోడాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో తమ జట్టుకు శ్రేయస్ అందుబాటులో ఉండట్లేదని ముంబయి క్రికెట్ అసోషియేషన్ కూడా ప్రకటించింది.
దీంతో అసలు విషయం బయటపడింది. నిజానికి బీసీసీఐ చెప్పినట్టు తను రంజీ ట్రోఫీల్లో ఆడాలి. అలా ఆడటం తనకి చిన్నతనంగా అనిపించి వెళ్లడం లేదు. ఎక్కడికి వెళుతున్నాడంటే బయట కోచింగ్ ఇనిస్టిట్యూట్ల్లో శిక్షణ పొందడానికి వెళుతున్నట్టు సమాచారం. ఇలా అబద్దాలు చెప్పి రంజీలు తప్పించుకున్న శ్రేయాస్పై బీసీసీఐ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇషాన్ కిషన్, శ్రేయాస్ ఇద్దరినీ ఇలా వదిలేస్తే, రాబోయే క్రికెటర్లు వీరినే అనుకరించే ప్రమాదం ఉందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. ఒక రూల్ పెట్టిన తర్వాత ఎంతటివారైనా పాటించాల్సిందేనని, వాటిని గౌరవించాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు.