Geethanjali Malli Vachindhi Teaser Launch: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మూవీలో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, ప్రియ, ముక్కు అవినాష్తో సహా మరికొంత మంది ఇందులో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే.
Read More: ఒక్క రోజే OTTలో 11 సినిమాలు.. సందడే సందడి..
ఇప్పుడు ఈ మూవీ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఈ టీజర్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకునేందుకు మేకర్స్ వినూత్నంగా ఆలోచించారు. ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్ను ఈ శనివారం బేగంపేట స్మశాన వాటికలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
ఇక ఓ తెలుగు సినిమా టీజర్ ఈవెంట్ ఈ విధంగా స్మశానవాటికలో ప్లాన్ చేయడం ఇదే తొలిసారి. ఈ అనౌన్స్మెంట్తో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి ఆలోచన రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఆలోచనతో టీజర్ను రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్ల కోసం వాడుకుంటున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇదొక థ్రిల్లింగ్ ఆలోచన అనే చెప్పాలి.