14 Days Remanded for Jagajyoti Bribery Case: లంచ తీసుకుంటూ దొరికిపోయిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతికి నాంపల్లి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆమె కాంట్రాక్టర్ నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. తొలుత ఆమెకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
ఏసీబీ అధికారులు జగజ్యోతిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు . దీంతో నిందితురాలిని చంచల్గూడ జైలుకు తరలించారు.
మరోవైపు లంచం కేసులో పట్టిబడిన వెంటనే జగజ్యోతి ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టిపెట్టారు. మంగళవారం ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.65 లక్షల 50 వేల నగదు లభ్యమైంది. అలాగే మూడున్నర కిలోలకుపైగా బంగారం దొరికింది. ప్లాట్లు, వ్యవసాయ భూములకు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
జగజ్యోతికి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీ విచారణలో నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.అప్పుడు ఆస్తుల చిట్టా జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.