Pawan Kalyan Bhimavaram Tour(AP politics) : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టికేలకు భీమవరంలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గంలోకి జనసేనాని ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి స్వాగతం పలికారు. భీమవరంలో ర్యాలీగా పవన్ కల్యాణ్ ముందుకు సాగారు. ఇరు పార్టీల కార్యకర్తల సందడితో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
భీమవరం చేరుకోగానే తొలుత టీడీపీ కీలక నేతలతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆమెతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు.
మరో ముఖ్య టీడీపీ నేత , భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఇంటికి పవన్ వెళ్లారు. ఆయనతో చాలాసేపు మంతనాలు సాగించారు. వచ్చే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన అనుసరించాల్సిన వ్యహంపై సమాలోచనలు చేశారు. కలిసి కట్టుగా పనిచేద్దామని సూచించారు.
Read More: నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్..! రాజీనామాకు ఎంపీ వేమిరెడ్డి సిద్ధం..!
వైసీపీ పాలన నుంచి ఏపీని రక్షించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన నేతలందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో టీడీపీ-జనసేన నేతల సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై జనసేనాని చర్చించనున్నారు.
భీమవరం టూర్ లో పవన్ కల్యాణ్ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కుటుంబాలు విచ్ఛిన్నం చేసే వ్యక్తి.. జగన్ అని మండిపడ్డారు. అన్ని అనర్థాలకు మూలం మానవ ప్రవృత్తే అని విశ్వనాథ అన్నారని గుర్తు చేశారు. కులాల మధ్య గొడవలు జరగాలన్నదే జగన్ నైజం అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అమరజీవీ పొట్టి శ్రీరాములను ప్రస్తావించారు. ఆయన ప్రాణత్యాగం చేయడం వల్లే ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నామని తెలిపారు.