Tribal Welfare EE Jyothi Arrested by ACB: ఏసీబీ వలకు చిక్కిన జ్యోతి అవినీతి చిట్టాను వెలికితీశారు అధికారులు. ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జ్యోతి ఇంట్లో దొరికిన ఆభరణాలు, కోట్ల విలువైన ఆస్తిపత్రాలు చూసి అవాక్కయ్యారు.
గిరిజన సంక్షేమశాఖ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి బిల్లుల మంజూరు కోసం.. గంగన్న అనే కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో.. పక్కాగా మాటు వేసిన అధికారులు మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో గంగన్న నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Read More: నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ..
అనంతరం ఆమె ఇంట్లో తనిఖీలు చేపట్టగా 65 లక్షల నగదుతోపాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్.. ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ 10 కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇక ఈ కిలాడీ లేడి ఏసీబీ అధికారులకు చిక్కిన వెంటనే అనారోగ్యమంటూ నానా హంగామా సృష్టించింది. గుండెనొప్పి అంటూ నాటకాలు మొదలుపెట్టడంతో.. ఆమెను హుటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అన్ని టెస్టులు నార్మల్గా ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. 2-D ఎకో టెస్ట్ అనంతరం డిశ్చార్జ్ చేయగానే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్కు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.