First tunnel railway in Kashmir: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం (T-50) అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 12.77 కిలో మీటర్లు ఉంటుంది. జమ్మూ-కాశ్మీర్ లో ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన బనిహాల్-ఖడీ-సుంబడ్- సంగల్ దాన్ సెక్షన్ (14.1కి.మీ) ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ-సుంబడ్ ల మధ్య ‘ టీ-50’ సొరంగ మార్గం వస్తుంది. బారముల్లా రెండు విద్యుత్ రైళ్లకు జమ్మూ నుంచి వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అయితే కశ్మీర్ లోయలో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్డం ఇదే తొలిసారి.
‘టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ. బనిహాల్- సంగల్దాన్ సెక్షన్లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్గా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో 2010లోనే పనులు ప్రారంభించారు. దాదాపు 14 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది ఈ సొరంగ మార్గం. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేశారు.
Read More: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాసం.. ఫిబ్రవరి 22న చర్చ..
యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం పొడవు 272 కి.మీ. బారాముల్లా- సంగల్దాన్, ఉధంపుర్- కాట్రా సెక్షన్ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్దాన్ల మధ్య 63 కిలోమీటర్ల వరకు పనులు సాగుతున్నాయి.
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్’లు ఈ మార్గంలోనే ఉన్నాయి. తాజాగా బనిహాల్- సంగల్దాన్ సెక్షన్ ప్రారంభంతో కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే లక్ష్యానికి మరింత చేరువైనట్లు అధికారులు పేర్కొన్నారు.