Poisoning of Alexei Navalny : రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో అనుమానాస్పద రీతిలో మరణించారు. ప్రపంచ దేశాలను సైతం షాక్కు గురి చేసిన ఈ ఉదంతానికి సంబంధించి నావల్నీ భార్య సంచలన ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే తన భర్తను చంపించారని యులియా నవల్నయా ఓ వీడియో సందేశంలో ధ్వజమెత్తారు. నరాలను దెబ్బతీసే నెర్వ్ ఏజెంట్ నొవిచోక్ను ప్రయోగించారని ఆరోపించారు. రెండు వారాల వరకు నావల్నీ పార్థివదేహాన్ని అప్పగించడం కుదరదని రష్యా ప్రభుత్వం తాజాగా ప్రకటించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది.
పార్థివ దేహానికి రసాయనిక విశ్లేషణలు జరపాల్సి ఉన్నందున 15 రోజుల వరకు అప్పగింత అసాధ్యమంటూ అధికారులు నావల్నీ తల్లితో స్పష్టం చేశారు. పైగా పార్థివ దేశం ఎక్కడున్నదన్న అంశంపై కుటుంబసభ్యులకు సరైన సమాచారం కూడా లేదు. ఆ విషయం తెలుసుకునేందుకు చేపట్టిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తమ కుట్ర బయట పడుతుందనే పుతిన్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని యులియా ఆరోపించింది.
Read more: అమెరికాలో మరో కొత్త జాంబీ వైరస్ కలకలం.. మనుషులకు సోకే చాన్స్!
శరీరంలో విషం ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు తమకు మృతదేహాన్ని అప్పగించరని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే నావల్నీపై నొవిచోక్ నెర్వ్ ఏజెంట్ ప్రయోగం ఏదీ జరగలేదంటూ ఆమె ఆరోపణలను పుతిన్ అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. 2020లో నెర్వ్ ఏజెంట్ ఇవ్వడం ద్వారా చేసిన హత్యప్రయత్నం నుంచి నావల్నీ సురక్షితంగా
బయటపడిన సంగతి తెలిసిందే.