Due to MS Dhoni I lost my Career said by Manoj Tiwari: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడాశాఖామంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాక్యలు చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందని అన్నాడు. తనకి కూడా కొహ్లీ, రోహిత్ శర్మలా వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే, నేను వారిలా గొప్ప ప్లేయర్ ని అయ్యేవాడినని అన్నాడు.
బీహార్తో చివరి మ్యాచ్ ముగిసిన అనంతరం కోలకతా స్పోర్ట్స్ జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మనోజ్ తివారీ మాట్లాడాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనని తుదిజట్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
38 ఏళ్ల మనోజ్ తివారి తన కెరీర్ లో 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్ లో 5,581 పరుగులు, టీ 20ల్లో 3,436 పరుగులు చేశాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ ఇండియా తరఫున 12 వన్డేలు ఆడి, 287 పరుగులు చేశాడు. 2011 చెన్నై వేదికగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే లో సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్ లో కోల్ కతా, పంజాబ్, పుణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు. 2024 సీజన్ రంజీ ట్రోఫీ లో బెంగాల్ తరఫున ఆడాడు. అయితే బిహార్తో జరిగిన చివరి మ్యాచ్ లో ఆడి అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ నాయకుల చేతిలో బీసీసీఐ ఉందని వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఈ విషయాలపై ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నిషేధం లేదా జరిమానాలు విధిస్తున్నారని అన్నాడు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినందుకే నా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారని తెలిపాడు.
బీసీసీఐని ప్రస్తుతం రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా బీసీసీఐ పాలన వ్యవహారాల్లో ఆటగాళ్లకు చోటు ఉండటం లేదు. రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ టోర్నీ ప్రాముఖ్యత కోల్పోనుంది.’అని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు.