Eiffel Tower closed again as staff extend strike : ప్రపంచ ప్రసిద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ మూతపడింది. ఫ్రాన్స్ లోని ఈ లోహ కట్టడం పేలవమైన ఆర్థిక నిర్వహణను నిరసిస్తూ సిబ్బంది సమ్మె చేపట్టారు. ఈ కారణంగా మూసివేయడంతో సోమవారం దీనిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురయ్యారు. పారిస్కు చెందిన SETE కంపెనీ టవర్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. టికెట్ హోల్డర్లు తొలుత వెబ్సైట్లో వివరాలు చూసుకుని.. టవర్ సందర్శనకు రావాలని ఆ కంపెనీ కోరింది.
తదుపరి సమాచారం కోసం ఈ-టికెట్ హోల్డర్లు తమ ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇదే కారణంతో ఈఫిల్ టవర్ మూతపడటం రెండు నెలల్లో ఇది రెండోసారి. SETE అనుసరిస్తున్న బిజినెస్ మోడల్ను సీజీటీ, ఎఫ్వో యూనియన్లు తూర్పారపడుతున్నాయి. ఈఫిల్ ఉద్యోగుల్లో అత్యధికులు సీజీటీ యనియన్లో ఉన్నారు. ఈఫిల్ టవర్ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయానికి అనుగుణంగా తమ జీతాలు పెరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read more: ERS-2 ఉపగ్రహం కూలేది రేపే..
ఈ మేరకు సమ్మెబాట పట్టారు. టవర్ను తిరిగి ఎప్పుడు తెరుస్తారనే దానిపై సమాచారం లేదు. పారిస్కు లాండ్మార్క్గా భావించే ఈఫిల్ టవర్ను ఏటా 70 లక్షల మంది సందర్శిస్తుంటారు. వీరిలో విదేశీ పర్యాటకులే అత్యధికం. ఈ వేసవిలో ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి బాగా పెరిగే అవకాశాలున్నాయి. 1887 జనవరిలో మొదలైన టవర్ నిర్మాణం 1889 మార్చి 31న పూర్తయింది.