Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్ లో సందేశ్ ఖాలీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మహిళలపై లైంగిక వేధింపుల జరగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివాదం మొదలైంది. బీజేపీ లీడర్ సువేందు అధికారి సందేశ్ ఖాళీ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో సువేందు అధికారి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. చివరికి సువేందు అధికారికి సందేశ్ ఖాళీ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
సందేశ్ఖాలీ ప్రాంతంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవవుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడుతోంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
బీజేపీ నేత సువేందు అధికారి కూడా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని సందేశ్ ఖాలీ పర్యటన చేపట్టారు. అయితే సువేందుతోపాటు సీపీఎం నాయకురాలు బృందా కారత్ను కూడా ధమఖాలీ వద్ద పోలీసులు ఆపేశారు. దీంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సువేందు వెంట పార్టీ కార్యకర్తలు లేకుండా ఘటనా ప్రాంతానికి వెళ్లొచ్చంటూ తాజాగా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో సందేశ్ఖాలీ ప్రాంతం ఉంది. తృణమూల్ నేత షాజహాన్ షేక్, ఆయన అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు అంటున్నారు. పోలీసులు టీఎంసీ నాయకుడికే అనుకూలంగా వ్యవహరించారని బాధితుల ఆరోపణ.
ఈడీ అధికారులపై దాడి కేసులోనూ షేక్ షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అతడు పరారీలో ఉన్నాడు. సందేశ్ఖాలీ కేసును కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఆ ప్రాంత పర్యటన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది.