BJP Vijay Sankalp Yatra In Telangana: తెలంగాణలో బీజేపీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసింది. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శంఖ పూరించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు.
తెలంగాణను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. అందుకు అనుగుణంగా యాత్రలు చేపడుతోంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ యాత్ర సాగుతుంది. 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ నేతలు ప్రచారం చేపట్టనున్నారు. మొత్తం 5,500 కిలోమీటర్లు విజయ సంకల్ప యాత్ర సాగనుంది. 106 సమావేశాలు నిర్వహిస్తారు. కీలక ప్రాంతాల్లో 102 రోడ్ షోలు చేపడతారు. మార్చి 2న విజయ సంకల్ప యాత్ర ముగియనుంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో సాధించిన విజయాలను బీజేపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పాలన సమయంలో జరిగిన కుంభకోణాలపై ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.
Read More: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి.. నేడు హై కమాండ్ తో భేటీ
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఓట్ షేర్ బాగా పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఈసారి సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతోపాటు ఇంకా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ పెద్దల భావిస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు విజయ సంకల్ప యాత్రలను షురూ చేసింది. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో పార్టీ అగ్రనేతలు ప్రచారం చేపట్టే అవకాశం ఉంది. విజయ సంకల్ప యాత్రలు పూర్తైన తర్వాత భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎన్నికలకు పార్టీ క్యేడర్ ను , నాయకులు కాషాయ పార్టీ సంసిద్ధం చేస్తోంది.