European Remote Satellite ERS-2 to Crash on Earth : యూరోపియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ERS-2 బుధవారం నేలపై కూలనుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర గాలుల అధ్యయనం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) 1990లలో ERS-1 తో పాటు ERS-2ను ప్రయోగించింది. 16 ఏళ్ల పాటు ERS-2 ఉపగ్రహం భూమిని నిశితంగా పరిశీలించి విలువైన సమాచారాన్ని అందించింది. 2011లో దాని సేవలు నిలిచిపోయాయి.
క్రమేపీ తన కక్ష్య నుంచి గమనం మార్చుకుంటూ 13 ఏళ్లకు నేలపై కూలిపోనుంది. కక్ష్య నుంచి జారుతున్న ఆ ఉపగ్రహం తాలూకు ఫొటోలను స్పేస్ ఏజెన్సీ తొలిసారిగా బయటపెట్టింది. అది బుధవారం ఉదయానికి నేల కూలనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉపగ్రహం భూమిదిశగా పయనిస్తున్న మార్గాన్ని ఈఎస్ఏలోని స్పేస్ డెబ్రిస్ ఆఫీసు నిశితంగా గమనిస్తోంది.
ERS-2 తన మిషన్ను పూర్తి చేసుకున్న అనంతరం గరిష్టంగా 100 ఏళ్లు, కనిష్ఠంగా 15 ఏళ్ల వరకు తన కక్ష్యలోనే ఉండగలదని అంచనా వేశారు. అయితే అది ఇప్పుడు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించనుంది.
నేల రాలుతున్న ERS-2 ఉగప్రహాన్ని దానికి సమీపంగా వచ్చిన ఉపగ్రహాలు తమ కెమెరాల్లో బంధించాయి. జనవరి 14, 18, 29, తాజాగా ఈ నెల 3న భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ERS-2ను క్లిక్ మనిపించాయి. అనంతరం 200 కిలోమీటర్ల ఎత్తును కోల్పోయి.. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి ప్రస్తుతం ఆ ఉపగ్రహం వచ్చేసింది.
రోజుకు పది కిలోమీటర్ల చొప్పున ఎత్తు తగ్గుతూ అది శరవేగంగా భూమికి సమీపిస్తోంది. ఎత్తు తగ్గే కొద్దీ దాని వేగం అపరిమితంగా పెరుగుతుంటుంది. అలా చివరగా భూమికి 80 కిలోమీటర్ల ఎత్తుకు రాగానే ముక్కలుముక్కలైపోతుంది. రీఎంట్రీ సమయంలో కొంత భాగం కాలిపోయినా.. మిగిలిన శకలాలు మాత్రం భూమిపై పడతాయి. ఫిబ్రవరి 21న రీఎంట్రీ జరిగే అవకాశాలు ఉన్నాయి యూరోపియన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే భూమిపై పడే శకలాల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ప్రాణనష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.
అంతరిక్ష శకలాలు భూమిపై కూలిపోవడం వల్ల వ్యక్తులు గాయపడటం అనేది చాలా అరుదు. 100 బిలియన్ల ఘటనల్లో ఒకటి మాత్రమే అలా జరగడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.