Alla Ramakrishna Reddy Joins YCP(AP political news): మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ తిరిగి వైసీపీలోకి చేరారు. సీఎం జగన్ .. ఆర్కేకు వైసీపీ కండువా కప్పారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంతగూటికి చేరారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సోమవారం రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు చేశారు. పార్టీలోకి తిరిగి రావాలని కోరారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలించాయి. ఆర్కే మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు అంగీకారం తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో వరసగా రెండుసార్లు ఆర్కే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచారు. 2019లో మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఓడించారు. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన ఆర్కేకు కొన్నిరోజుల క్రితం జగన్ షాకిచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్ కేబినెట్ 1.O, కేబినెట్ 2.Oలో ఆర్కేకు స్థానం దక్కలేదు. చివరి ఎమ్మెల్యే టిక్కెట్ కు ఎసరు పెట్టడంతో ఆయన పార్టీని వీడారు.
Read More: కాక రేపుతున్న కృష్ణాజిల్లా రాజకీయం.. గుడివాడలో వైసీపీ టికెట్ ఎవరికి ?
మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని జగన్ కొంతకాలం క్రితం నియమించారు. ఈ క్రమంలో ఆర్కే పార్డీని వీడారు. అప్పుడు ఆయన షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా షర్మిల తన కుమారుడి వివాహానికి సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు ఆర్కే అక్కడ వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ పెద్దల రంగంలోకి దిగి ఆర్కేను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆర్కే మళ్లీ పార్టీలో చేరడంతో వైసీపీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.