Telangana Poll Tracker Survey Results : తెలంగాణలో పీపుల్స్పల్స్ – సౌత్ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా లోక్సభ ఎన్నికల కోసం నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో కాంగ్రెస్పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ 8 నుంచి 10, BRS 3 నుంచి 5, BJP 2 నుంచి 4 పార్లమెంట్ సీట్లు గెలుపొందే అవకాశం ఉందని.. పీపుల్స్పల్స్ – సౌత్ఫస్ట్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం, BRSకు 31 శాతం, BJPకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్పార్టీ 1 శాతం ఓట్లు, BJP 9 శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా.. ప్రధాన ప్రతిపక్షం BRS మాత్రం 6 శాతం ఓట్లు కోల్పోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకూ ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో, 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో సర్వే నిర్వహించారు.
గతేడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సర్వేలోనూ ఈసారి కాంగ్రెస్ అధికారం చేపడుతుందని తేలింది. అదే నిజమైంది. లోక్ సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే పెద్దల్ని కలిసేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇదెంతవరకూ నిజమన్నది తెలియాల్సి ఉంది.
Read More: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి.. నేడు హై కమాండ్ తో భేటీ
పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ను.. ఈసారి ప్రజలు ఓటుతో గద్దె దించారు. ఓటమిని చవిచూసిన నాటి నుంచి కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరు కాలేదు. అదేమని అడిగితే.. అనారోగ్య సమస్యలను సాకుగా చూపించారు బీఆర్ఎస్ నేతలు. అంత అనారోగ్యంగా ఉంటే నల్గొండ సభకు ఎలా వెళ్లారని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న బ్యారేజీల్లో ఒక్కొక్క లోపం బయటపడుతుంది. ఎన్నికలకు ముందు మేడిగడ్డ కుంగిపోగా.. ఇప్పుడు అన్నారం పరిస్థితీ అదే. కుంగిన మేడిగడ్డను ఇటీవలే పరిశీలించిన సీఎం రేవంత్ బృందం.. అసెంబ్లీలో ఇరిగేషన్ పై, మేడిగడ్డపై పెద్ద చర్చను లేవనెత్తింది. కాంగ్రెస్ ప్రశ్నలకు నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు నీళ్లు నమిలారు. కాళేశ్వరంలో భారీ లోపాలున్నాయని.. అటు విజిలెన్స్, ఇటు కాగ్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కాంగ్రెస్ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రాజెక్టు వ్యయ అంచనాలను పెంచేసి అవినీతికి పాల్పడిందని ఆరోపించింది.