Shubman Gill Election Campaign(Latest sports news telugu): ఏటి కంగారు పడుతున్నారా? గిల్ మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి ఎప్పుడు బయటకి వచ్చాడు. ఎప్పుడు పంజాబ్ వెళ్లాడు? ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు? ఏ రాజకీయ పార్టీకి వంత పాడుతున్నాడు? అయితే నాలుగో టెస్ట్ ఆడటం లేదా? అసలు గిల్ ఎన్నికల ప్రచారంలో తిరగొచ్చా? అబ్బబ్బా.. ఎన్నెన్ని సందేహాలండీ బాబూ.. కంగారుపడకండి అంత లేదు..
విషయం ఏమిటంటే పంజాబ్ లో ఓటింగు పర్సంటేజ్ తక్కువగా ఉంది. అందువల్ల ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి అక్కడ ఎన్నికల అధికారులు విభిన్నమైన మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం గిల్ను ‘స్టేట్ ఐకాన్’గా మార్చింది.
ఎందుకంటే శుభ్ మన్ గిల్ పంజాబ్ వాడే కాబట్టి, తననే తీసుకురానున్నారు.
అయితే తను ఏ రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయడు. దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయండి, అని మాత్రమే అభ్యర్థిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు ఎన్నికల వేళ, ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని, తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించాలని గిల్ విజ్ఞప్తి చేయనున్నాడు.
ఓటింగ్ శాతం 70 శాతం దాటేలా, ఓటర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో పలు ప్రచార కార్యక్రమాల్లో గిల్ భాగమవుతారని ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్ సి, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read more: రాంచీ టెస్ట్ కి.. యశస్వికి విశ్రాంతి : వచ్చేస్తున్న కేఎల్ రాహుల్
‘ఈసారి 70 శాతాం కచ్చితంగా దాటాలి’అని ఎన్నికల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పంజాబ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో 65.96 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు దానిని మరో 5 శాతం పెంచే పనిలో బిజీగా ఉన్నారు. అందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే గిల్ ని ప్రచారకర్తగా తీసుకు రానున్నారు.
ముఖ్యంగా యువతలో గిల్ కు ఆదరణ ఉందని, అందుకే లోక్ సభ ఎన్నికలకు ‘స్టేట్ ఐకాన్’గా నిలిచారని సిబిన్ చెప్పారు. పంజాబ్లోని అన్ని డిప్యూటీ కమిషనర్లతో శుక్రవారం జరిగిన సమావేశంలో గత ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరినట్లు సిబిన్ సి తెలిపారు.
ఇలాంటి ప్రాంతాల్లో గిల్ నిర్వహించనున్న అవగాహన ప్రచారాలు, విజ్ఞప్తులు ఓటర్లను చైతన్యవంతం చేయడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయన్నారు. ఇంతకుముందు, ప్రముఖ పంజాబీ గాయకుడు టార్సెమ్ జస్సర్ కూడా ‘స్టేట్ ఐకాన్’గా ఎంపికయ్యారు. అతను కూడా ఓటర్లను చైతన్యవంతం చేసే దిశగా పనిచేస్తాడని తెలిపారు.
యువత కాకుండా ఇతర వయసుల వారు అధిక సంఖ్యలో ఓటు వేయాలని, భారతదేశ ప్రగతికి దోహదపడాలని, మీ ఓటే ఒక ఆయుధమని ఇన్సిపిరేషన్ స్పీచ్ లను సిబిన్ సి ఇస్తున్నారు. ఏప్రిల్-మేలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.