Medaram Jathara: తెలంగాణలో మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 21) రోజున సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభంకానుంది. కాగా మంగళవారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన కుమారుడు జంపన్న మేడారానికి బయలెల్లనున్నారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నేపల్లి నుంచి జంపన్నను గిరిజన సాంప్రదాయాల నడుమ శివసత్తుల పూనకాల మధ్య పూజారులు మేడారానికి తరలించనున్నారు.
ముందుగా మంగళవారం ఉదయం పూనుగొండ్ల సమీపంలోని దేవుడిగుట్ట నుంచి పగిడిద్దరాజును దేవాలయంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. శాంతి పూజలు తర్వాత పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్దం చేసి.. ఆ రూపాన్ని గ్రామంలో ఊరేగిస్తారు.
అనంతరం పూజారులు కాలి నడకన పూనుగొండ్ల అడువుల నుంచి మేడారానికి బయలుదేరుతారు. పూజారి జగ్గారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇతనితో మరో పది మంది పూజారులు పూనుగొండ్ల నుంచి మేడారానికి బయలుదేరుతారు.
Read More: ఆర్త జన రక్షకుడు.. అంతర్వేది నారసింహుడు..
దారిలో గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి లక్ష్మీపురంలో పెన్క వంశీయులు రాత్రికి విడిది ఏర్పాటు చేస్తారు. బుధవారం ఉదయం బయలుదేరి రాత్రికి సారలమ్మ గద్దెన్నెక్కే సమయానికి పగిడిద్దరాజును మేడారానికి చేరుస్తారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు పోలెబోయిన వంశస్థులు సమ్మక్క తనయుడు, సారలమ్మ సోదరుడు జంపన్నను మేడారానికి బయలుదేరనున్నారు. పూజారి పోలెబోయిన సత్యం దగ్గరుండి రాత్రి 7 గంటల తర్వాత లక్షల మంది భక్తుల నడుమ జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.