KCR Delhi visit updates(Latest political news telangana): బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ఖరారు అయినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ తొలిసారి ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ వారంలో గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఓ వైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఫోకస్ పెట్టారు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నదన్న ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కార్ చేసిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించింది. ప్రధానంగా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టి మేడిగడ్డ బ్యారేజీ లో జరిగిన అవినీతిని అడుగడుగునా ఎండగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో ఇటీవలే అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం కూడా విడుదల చేసి ప్రభుత్వం కేసీఆర్ వైఫల్యాలను వివరించింది.
ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు మంత్రులు. ఇదిలా ఉండగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేస్తాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది.
ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసి ఫామ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు గులాబీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ బలానికి బీజేపీ క్యాడర్ కూడా తోడు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారు కేసీఆర్. ఈ మేరకు చర్చలు సైతం జరుగుతున్నాయనే ఆరోపనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ అకస్మాతుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో పొత్తు కోసమేనా.. లేక కాళేశ్వరం ప్రాజెక్టులో తమను తప్పించమని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద విజ్ఞప్తి చేయడానికా అనేదానిపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More: గుడ్ న్యూస్.. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరిక ప్రచారం ఇలా ఉంటే.. ఈ వార్తలకు బలం చేకూరేలా బీజేపీ అగ్రనేత అమిత్ షా.. ఎన్డీఏతో కలిసేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని ప్రకటించారు. త్వరలోనే ఎన్డీఏలో భారీగా చేరికలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
దీంతో ఈ పర్యటన లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతారా? లేక పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై చర్చించేందుకు బీజేపీ నేతలతో సమావేశం అవుతారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఒకవేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తు అంశంపైనే అయితే.. ఇన్ని రోజులు కేసీఆర్ పై దుమ్మెత్తి పోసిన తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసేందుకు సుముఖత చూపుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.