IIT Tirupati, IIM Visakhapatnam(Latest andhra news in telugu): ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపించిన వేళ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అంకితం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు కూడా విద్యా రంగానికి సంబంధించినవే. వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందినవే కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటి వల్ల ఈ రెండు ప్రాంతాలు ఎడ్యుకేషనల్ హబ్గా గుర్తింపు పొందే ఆస్కారం ఉంది.
ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి తిరుపతి సమీపంలో నిర్మితమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాగా.. రెండవది విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐఐటీ-తిరుపతి, ఐఐఎం విశాఖపట్నంలను ఈ నెల 20న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Read More: రాష్ట్రానికి ఏం చేశావని ఓటు అడుగుతావు.. చంద్రబాబును ప్రశ్నించిన సజ్జల..
వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎస్, ఐఐఎంలు, ఐఐఐటీడీఎం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఐఐటీ- భిలాయ్, ఐఐటీ- జమ్మూ, ఐఐఐటీడీఎం- కాంచీపురం పూర్తిస్థాయి క్యాంపస్ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
వాటన్నింటితో పాటు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని నిర్మించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ, అగర్తలలో నిర్మించిన సెంట్రల్ సంస్కృత యూనివర్శిటీని మోదీ క్యాంపస్ను ప్రారంభించనున్నారు. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వాటన్నింటి విలువ సుమారు 13,375 కోట్ల రూపాయలు ఉంటుంది.