SP-Congress Seat Sharing In UP: ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకం పెండింగ్లో పడింది. అయితే ఎస్పీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల పంపకంపై చర్చలు తేలే వరకు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు తమ పార్టీ దూరంగా ఉంటుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సూటిగా చెప్పారు.
దాదాపు తొమ్మిది నెలల క్రితం జూన్ 2023లో 16 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు పాట్నాలో సమావేశమయ్యారు. బెంగళూరులో మళ్లీ కలిసినప్పుడు ఇండియా అనే కూటమి ఉనికిలోకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 26 ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటిపై ఉండేవి. ఈ ఇండియా కూటమి అధికార బీజేపీకి పెద్ద సవాల్గా మారనుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి నెల మూడోవారం నడుస్తోంది. బహుశా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నెలలో ప్రకటించవచ్చు. ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు విపక్షాల కూటమి ఇండియాలోని పార్టీలు నిర్ణయించలేకపోయాయి.
నితీష్ కుమార్, జయంత్ చౌదరి నిరాశ చెంది పార్టీ మారారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు తమ పార్టీలు ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని అంటున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్పై మండిపడ్డారు. సీట్ల పంపకంపై చర్చలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ ‘న్యాయ యాత్ర’లో ఎస్పీ భాగం కాదని అఖిలేష్ తేల్చి చెప్పారు.
బీజేపీని ఓడించాలనే ఉద్దేశ్యంతో తొమ్మిది నెలల కిందట ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు ఏకంగా తొమ్మిదడుగులు కూడా వేయలేకపోయాయని అఖిలేష్ వైఖరి తెలియజేస్తోంది. రేసు ప్రారంభం కాకముందే కుంటుపడిన గుర్రంలా తయారైంది కూటమి పరిస్థితి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో సాగుతోంది. కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారని అఖిలేష్ ప్రకటన స్పష్టం చేస్తోంది. యూపీలోని 80 లోక్సభ స్థానాలకుగాను 15 సీట్లు కాంగ్రెస్కు ఇవ్వాలని ఎస్పీ ఆఫర్ చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థుల జాబితాను కూడా ఎస్పీ విడుదల చేసింది.