Jubilee Hills Boy Death Case: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పదేళ్ల బాలుడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఓ వృద్దుడి కామవాంఛకు ఆ బాలుడు మృతి చెందినట్లు తెలిసింది. బాలుడిని పార్కుకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు వృద్దుడు. దీంతో బాలుడు గట్టిగా అరిచాడు. బాలుడు అరవకుండా నిందితుడు నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడి కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న మన్యం నాయక్ అనే వృద్ధుడు బాలుడిని హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. తన కామావాంఛ తీర్చుకునేందుకు బాలుడిని పార్కుకు తీసుకెళ్లగా.. బాలుడు గట్టిగా కేకలు వేయటంతో చిన్నారి గొంతు నులిమి చంపేసి నాలాలో పడేసినట్లు పోలీసు విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ 5లోని దుర్గా భవానీ నగర్ బస్తీవాసి ముడావత్ రమేష్, కవిత రెండో కుమారుడు కార్తీక్ అలియాస్ పండు (10) ఈనెల 13న రాత్రి చిప్స్ ప్యాకెట్స్ కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత రాత్రి అయినా బాలుడి ఇంటికి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఇతర బంధువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది. దీంతో అదే రోజున రాత్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు బాలుడి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే మరుసటి రోజే జూబ్లీహిల్స్ దగ్గర ఉన్న భవానీ నగర్ లో పార్కులోని ఓ డ్రైనేజీ నాలాలో బాలుడి మృతిదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు పోలీసులు. బస్తీకి చెందిన మన్యం నాయక్ అనే వృద్ధుడు కొంతకాలంగా కనిపించకపోగా 15 రోజుల క్రితమే వచ్చి కార్తిక్తో స్నేహం పెంచుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది. బాలుడి కుటుంబంతో గొడవలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు మృతిచెందిన నాటి నుంచి మన్యం నాయక్ ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
మద్యం మత్తులో ఉన్న మన్యం నాయక్.. కార్తీక్ను ఈనెల 13న రాత్రి పార్కులోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ప్రయత్నంలో ఎదురుతిరిగిన అతడి తలపై రాయితో కొట్టి డ్రైనేజీలోకి తోసేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న మన్యం నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. కామవాంఛ తీర్చుకునే ప్రయత్నంలోనే చిన్నారిని చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.