Today Weather Update: ఫిబ్రవరి నెల దాటనే లేదు.. అప్పుడే కాక మొదలైంది. ఈ సారి వేసవిలో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువే ఉండొచ్చన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో జనంలో ఆందోళన మొదలైంది.
కేరళలో గత వారం నుంచే ఆ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే టెంపరేచర్ నమోదవుతోంది. పెరుగుతున్న ఎండలకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు కేరళవాసులకు భారత వాతావరణ శాఖ(IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో పలు సూచనలు చేసింది.
కోజికోడ్లో 37 డిగ్రీల సెల్సియస్, కన్నూర్, తిరువనంతపురం జిల్లాల్లో 36 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు చేరాయి. వడదెబ్బ, సన్బర్న్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Read More: మధ్యప్రదేశ్లో 500 గోవులమృతి !
మార్చి-మే నెలల మధ్య సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఎన్వోఏ(నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) ఇప్పటికే హెచ్చరించింది. మార్చి నుంచి మే వరకు వేసవికాలం. ఆ సమయంలోనే ఎల్నినో తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం 75 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1972–73, 1982–83, 1997–98, అలాగే 2015–16లోనూ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అనేక దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కరవు, వరదల వంటి విపత్తులను ఎదుర్కొన్నాయి. 2024లోనూ అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని అంచనా. అందుకే ఈ వేసవిని గట్టెక్కెదెలా బాబోయ్ అని బెంబేలెత్తుతున్నారు.