Nara Lokesh Speech: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న శంఖారావం సభలకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటెత్తుతున్నారు. లోకేశ్ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో ఈ ప్రాంతంలో జరిగిన అక్రమాలను ఎండగడుతున్నారు. వైసీపీ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
తాజాగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నారా లోకేశ్ ‘శంఖారావం’ సభలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న వైజాగ్ ను వైసీపీ నేతలు విషాదనగరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్ అని విమర్శించారు. నవరత్నాల పేరిట నవమోసాలు చేశారని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
సీఎం వైఎస్ జగన్ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయలేదు కానీ.. మందులో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. ఆ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారని తెలిపారు. అందుకే ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
Read More: ప్లేస్, టైమ్ చెప్పు.. జగన్కు చంద్రబాబు ఛాలెంజ్..
ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం 2 నెలలు ఓపిక పట్టాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ- జనసేన శ్రేణుల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. రూ.5 ఇస్తే పేటీఎం బ్యాచ్ ఏపనైనా చేస్తుందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ నినాదానికి కట్టుబడి ఉండాలని టీడీపీ-జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను తానే తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.