Jasprit Bumrah set to be rested for fourth Test : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనున్న నాలుగో టెస్ట్ కి దూరం కానున్నాడు. విషయం ఏమిటంటే టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ని బుమ్రా ఒక్కడే తను భుజస్కంధాలపై మోస్తున్నాడు. అందుకని బీసీసీఐ, ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
నిజానికి చాలాకాలం రెస్ట్ తీసుకుని 2023 వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా జట్టులో జాయిన్ అయ్యాడు. రకరకాల ఫార్మాట్లలోకి ఆటగాళ్లను తీసుకుంటూ ఉంటారు. మూడు ఫార్మాట్లలో ఆడే అతి తక్కువ మందిలో బుమ్రా కూడా ఒకడు. అందువల్ల తనపై విపరీతమైన భారం పడుతోంది. నిజానికి టీమ్ ఇండియాలో పేస్ భారమంతా బుమ్రా ఒక్కడే మోస్తున్నాడనేది నిజం. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టెస్టుల్లో 81 ఓవర్లు వేసి, 17 వికెట్లు తీశాడు. అలాగే ప్రస్తుతానికైతే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా తనే కనిపిస్తున్నాడు.
సిరాజ్ ఒక మ్యాచ్ లో సహకరిస్తే, ఒక మ్యాచ్ లో చేతులెత్తేస్తున్నాడు. దీంతో బుమ్రా అలసిపోతున్నాడు. ఈ క్రమంలో తనకి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అందువల్ల బుమ్రా కానీ రెస్ట్ లో వెళితే మహ్మద్ సిరాజ్ తో పాటు ముఖేష్ కుమార్ బౌలింగ్ చేయవచ్చునని అంటున్నారు. కొత్త ఆటగాడు ఆకాశ్ దీప్ కూడా వీరికి అందుబాటులో ఉంటాడు.
అయితే బుమ్రా రాజ్ కోట్ వెళ్లకుండా డైరక్టుగా అహ్మదాబాద్ వెళ్లిపోతున్నాడని సమాచారం. కేఎల్ రాహుల్ కి బీసీసీఐ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాలుగో టెస్ట్ కి జట్టులోకి వచ్చేస్తాడు. రెండు టెస్టుల్లో విఫలమైన రజత్ పటీదార్ ను తప్పించే అవకాశాలున్నాయి. రెండు టెస్టుల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని రజత్ చేజార్చుకున్నాడని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. మళ్లీ ఈ అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు.
ఎందుకంటే రాహుల్ వస్తాడు, తర్వాత ఎప్పటికైనా కొహ్లీ వస్తాడు. ఆల్రడీ మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటికిప్పుడు తనపై వేటు పడే అవకాశం లేదు. గిల్ జాగ్రత్త పడ్డాడు. యశస్వి స్టాండ్ అయిపోయినట్టే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తవాళ్ల రాకతో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి ఆల్రడీ గండి పడిపోయింది.
నాలుగో టెస్టులో బుమ్రా వెళితే పేస్ బలహీనపడుతుందని అంటున్నారు. అయినా సరే, వచ్చే టీ 20 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. నాలుగో టెస్ట్ గెలిస్తే, ఇంక ఐదో టెస్టుకి బుమ్రా రాకపోవచ్చు. లేదంటే మాత్రం తప్పకుండా కలుస్తాడని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.