Gruha Jyothi Scheme Guidelines: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని చెప్పిన రేవంత్ సర్కార్.. చెప్పిన మాట ప్రకారం ఒక్కోహామీని అమలు చేస్తూ వస్తోంది. ఇటీవలే మరో రెండు పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలుపగా.. వాటి అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. అందులో గృహజ్యోతి అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది.
అయితే.. నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినవారికి ఈ పథకం వర్తించదు. ఇప్పటికి ఈ పథకం కోసం కోటి 9 లక్షల, 1255 దరఖాస్తులు రాగా.. వాటిలో 64 లక్షల 57 వేల 891 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గృహజ్యోతి అమలుకు ఏటా.. రూ.4,164.29 కోట్ల ఖర్చు ఉంటుందని రాష్ట్ర ఇంధనశాఖ అంచనా వేసింది. అలాగే పథకానికి ఎవరెవరు అర్హులవుతారో తేల్చే అంశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Read More: మహిళలకు శుభవార్త.. అదేంటంటే..?
మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుండగా.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా పథకం అమలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23 నెలకు సగటున వాడిన విద్యుత్ కు అదనంగా 10 శాతం విద్యుత్ ను మాత్రమే గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. 2022-23లో నెలకు సగటున 200 యూనిట్లకు మించి విద్యుత్ ను వాడినట్లైతే ఈ పథకం వర్తించదు.
లబ్ధిదారుడి రేషన్ కార్డు ఆధార్ తో అనుసంధానమై ఉండాలి. విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండకూడదు. నెలకు 101 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను పొందుతున్న ఎస్సీ, ఎస్టీలకు కూడా గృహజ్యోతి వర్తిస్తుంది. 64,57,891 తెల్లరేషన్ కార్డుదారుల్లో.. 34 లక్షల 59 వేల 585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ ను కలిగి ఉంటారు.