Chandrababu Open Challenge To Jagan(AP political news): ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన పార్టీల సింబల్స్ పై సెటైర్లు వేశారు. సైకిల్ బయట ఉండాలి. గాజు గ్లాసులో సింకులో ఉండాలి. ఫ్యాన్ మాత్రం ఇంట్లో ఉండాలి అంటూ చమత్కరించారు.
జగన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. జగన్ సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ను విసిరి పారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు.
టీడీపీ పాలన, వైసీపీ పాలనపై చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ చేశారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామంటూ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సీఎం వైఎస్ జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎక్స్ వేదికగా ఈ సవాల్ చేశారు.
Read More: టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి..
పన్నుల బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని సీఎం జగన్ ను చంద్రబాబు విమర్శించారు. విధ్వంస పోకడలతో ఏపీ భవిష్యత్ను కూల్చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డీ? అంటూ ప్రశ్నించారు. జగన్, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని పేర్కొన్నారు. ఇంకా 50 రోజులే సమయం ఉందన్నారు.
భస్మాసురుడి కథను చంద్రబాబు ప్రస్తావించారు. వరం ఇచ్చిన పరమ శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. అసత్య ప్రసంగాలు కాదు.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు.ప్లేస్, టైమ్ చెప్పాలని జగన్ కు సవాల్ విసిరారు. తాను ఎక్కడికైనా వస్తానన్నారు. ఏ అంశంపైనైనా చర్చిస్తానని స్పష్టంచేశారు. సిద్ధమా జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.