Rohit Sharma Refuses to Praise Yashasvi Jaiswal: యువ కిశోరం యశస్వి జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి, టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మను మాట్లాడమని కోరితే, జైశ్వాల్ గురించి ఇప్పటికి చాలాసార్లు చెప్పానని అన్నాడు. వైజాగ్లో కూడా డబుల్ సెంచరీ సాధించినప్పుడు అతని ఆటతీరు, అతని నైపుణ్యాలన్నీ వివరించానని తెలిపాడు.
తను బాగా కుర్రాడు. ఇంకా భారత క్రికెట్లో బోలెడు భవిష్యత్తు ఉంది. పొగడ్తలనేవి మనిషి ఎదుగుదలకు మంచివి కావు. అందుకనే మనసులోనే తనని అభినందిస్తున్నానని అన్నాడు. ఇంక తన గురించి ఎక్కువగా చెప్పాలని అనుకోవడం లేదు.
తను కెరీర్ను అత్యున్నతమైన బిగినింగ్తో ప్రారంభించాడు. ఇదే చివరి వరకు కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ‘అతను మంచి ఆటగాడు’ అని మాత్రం చెప్పగలనని అన్నాడు.
Read More: ఇద్దరు అరంగేట్రం ప్లేయర్స్ అదుర్స్..! సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. ధృవ్ అద్భుతమైన రన్ అవుట్..
ఈ విషయంలో రోహిత్ శర్మతో అందరూ ఏకీభవిస్తున్నారు. మనిషిని నాశనం చేసేది పొగడ్తలేనని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఎవరైనా నిన్ను పొగుడుతున్నారంటే, వారికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. నువ్వు బాగా పని చేస్తున్నావు, నువ్వు బాగా రాస్తున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు బాగా ఆడుతున్నావని అంటే చాలు, అది వాడి బుర్రకి ఎక్కేసి, అది అహంకారంగా మారి, ఇక వాడు భూమ్మీద నడవడు. రెండు చొక్కా బొత్తాలు విప్పేసి, భూమికి నాలుగు అడుగులు ఎత్తున నడుస్తుంటాడు. వాడిని మళ్లీ భూమ్మీదకు దించడం చాలా కష్టం. అందుకని దయచేసి ఎవరినీ పొగడవద్దని నెట్టింట క్లాసులు పీకుతున్నారు.
నీకేంట్రా, నువ్వు బ్రహ్మాండంగా చదువుతావు అని చూడండి, మరుసటి రోజు నుంచి వాడికి మార్కులు పడిపోతుంటాయని ఉదాహరణలు చెబుతున్నారు. అందుకనే రోహిత్ శర్మను మెచ్చుకుంటున్నారు. యశస్వికి నేను గొప్ప ఆటగాడిని, బ్రహ్మాండంగా ఆడుతానని అనుకుంటే చాలు వినోద్ కాంబ్లీలా అయిపోతాడని ఉదాహరణ చెబుతున్నారు.
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ క్లాస్ మేట్స్ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఇద్దరూ ఇండియన్ క్రికెట్లోకి ఘనంగానే వచ్చారు. సచిన్ భారతరత్న అందుకున్నాడు. కాంబ్లీ పతనమైపోయాడని గుర్తు చేస్తున్నారు.