Delhi Liquor Scam Case Update: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు.. విచారణకు రావాల్సిందిగా 6వ సారి సమన్లు జారీ చేసింది ఈడీ. సోమవారం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. ఈసారి కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లలేదు. తాను విచారణకు హాజరు కావడం లేదని సమాచారమిచ్చారు. ఇక ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టి పారేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించింది ఆప్.
ఢిల్లీ లిక్కర్ కేసు ఆప్ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఈడీ ఉచ్చు బిగిస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందే సీఎం కేజ్రీవాల్ని అరెస్టు చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న రౌస్ అవెన్యూ కోర్టు జారీ చేసిన పలు సమన్లను సీఎం కేజ్రీవాల్ ఖండిస్తూ కోర్టుకు గైర్హాజరవ్వడమే ఆప్ నేతల భయానికి కారణం. అయితే ఈ ఉత్కంఠకు తెరదీస్తూ సీఎం కేజ్రీవాల్ ఈనెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావడంతో కోర్టు తదుపరి విచారణ మార్చి 16కి వాయిదా వేసింది. దీంతో సీఎం కేజ్రీవాల్ కు తాత్కాలిక ఊరట లభించింది.
Read More: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని మార్చి 16న వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికి ఆరుసార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈడీ ఆయనపై ఫిర్యాదు చేసింది. సెక్షన్ 174 ఐపీసీ నిబంధనలను, సెక్షన్ 50 మనీ లాండరింగ్ చట్టాన్ని సీఎం కేజ్రీవాల్ ధిక్కరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయంగా ప్రేరేపించబడినవని పేర్కొంటూ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఈడీ ఫిర్యాదుపై కోర్టు జారీ చేసిన సమన్లకు సమాధానంగా సీఎం కేజ్రీవాల్ ఈనెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్ కు హాజరయ్యారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, బడ్జెట్ ఉన్నందున తాను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తనకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తాను మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కాగలని కోర్టుకు తెలపడంతో ఆ ప్రకారం ఆదేశాలు జారీ చేస్తూ, కేసు విచారణను మార్చి 16వ తేదీకీ వాయిదా వేసింది.
Read More: మేయర్ పదవికి మనోజ్ రాజీనామా.. సుప్రీంకోర్టు విచారణకు ముందు కీలక పరిణామం..
లిక్కర్ కేసుపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని పేర్కొన్నారు. ఆ సమన్లు పూర్తిగా చట్ట విరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఆపడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్నికలలోగానే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలకు రెండు నెలల ముందే తనను విచారణకు ఎందుకు పిలవాలని ఆయన ఈడీని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి ఎన్నికలకు దూరం చేయాలన్నదే బీజేపీ కుట్రని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇద్దరు ఆప్ నేతలను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలులో ఉన్నారు. సిసోడియా పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కోర్టు తిరస్కరిస్తూనే వచ్చినా, ఇటీవల తన మేనకోడలి విహహానికి హాజరయ్యేందుకు రౌస్ అవెన్యూ కోర్టు మూడురోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అది పూర్తికావడంతో ఈనెల 16న ఆయన తీహార్ జైలుకు వెళ్లారు. గత ఏడాది ఫిబ్రవరి 23న లిక్కర్ కేసులో సీబీఐ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.