Medaram Jathara latest news: జాతర ప్రారంభమవకముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే ఐదు లక్షల మంది సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు మహా జాతర జరగనుంది.
మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ దాదాపు 1000 స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కల్పించడంతో పెద్ద ఎత్తున మేడారానికి తరలివస్తున్నారు.
ఆదివారం తాడ్వాయి, పస్రా, ఊరట్టం, నార్లాపూర్ పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
Read More: మహిళలకు శుభవార్త.. అదేంటంటే..?
ఇక జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడానికి నలుగురు మంత్రుల బృందం మేడారానికి వెళ్లనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
మేడారం జాతర ఫిబ్రవరి 21న ప్రారంభమవుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో.. తొలి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దె మీదకు చేరుకుంటారు. ఇక రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దె మీదకు వస్తారు. ముఖ్యమైన మూడో రోజు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక నాలుగో రోజు అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. దీంతో ఈ మహాజాతర ముగుస్తుంది.