IND vs ENG Third Test: యువకులతో కూడిన టీమ్ ఇండియా అసలు రాజ్ కోట్ లో గెలుస్తుందా? లేక ఇంగ్లాండ్ కి చక్కగా అప్పగించేస్తుందా? అని అనుకున్నారు. ఎందుకంటే ముగ్గురు పూర్తిగా కొత్తవాళ్లు, మరో ఐదుగురికి అంత అనుభవం లేదు. ఇలాంటి వారినేసుకుని రోహిత్ శర్మ ఎలా గోదారి ఈదుతాడని అంతా అనుకున్నారు. కానీ వారితోనే సంచలన విజయం నమోదైంది.
టెస్టు చరిత్రలో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయమని చెప్పాలి.
మరోవైపు ఇంగ్లాండ్కు అత్యంత ఘోర పరాజయాల్లో ఇది రెండోది. 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 పరుగుల తేడాతో ఓటమి అనంతరం ఇంగ్లాండ్కు ఇదే అతి పెద్ద ఓటమి. అంతేగాక బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో విజయవంతంగా ఆడుతున్న ఇంగ్లాండ్ వరుసగా రెండు టెస్టులు ఓడిపోవడం ఇది రెండోసారి. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇలాగే రెండు టెస్టుల్లో వరుసగా ఓటమిపాలైంది.
Read More: రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ విలవిల.. భారత్ రికార్డు విజయం..
ఈ పరాజయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ కొన్నిసార్లు మన వ్యూహాలు వర్కవుట్ కావు. ప్రత్యర్థులు దానిని ఛేదిస్తుంటారు. ముఖ్యంగా యశస్వి జైశ్వాల్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే మా బ్యాటర్ బెన్ డకెట్ కూడా చాలా బాగా ఆడాడు.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందనే అనుకున్నాం. బెన్ డకెట్ కి సపోర్ట్ గా నిలవడంలో మూడోరోజు మేం ఫెయిల్ అయ్యాం. అంతేకాదు తర్వాత మంచి భాగస్వామ్యాలు నిర్మించలేకపోయామని అన్నాడు.
ఈ ఓటమిపై జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుంటాం. ప్రస్తుతం వెనుకపడి ఉండొచ్చు. కానీ హైదరాబాద్ టెస్ట్ లా విజయం సాధించి సిరీస్ ని సమం చేస్తామని అన్నాడు. అయితే చాలా సందర్భాల్లో ఇలాంటి క్లిష్టమైన దశల నుంచి బయటకు వచ్చామని అన్నాడు. అందుకే ఓడిపోయిన వాటి గురించి కాకుండా, జరగాల్సిన మ్యాచ్ లపై ఫోకస్ పెడతామని బెన్ స్టోక్స్ అన్నాడు.