Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసినటువంటి డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదన్నారు. ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. చాలా కాలం నుంచి నెలనెలా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారన్నారు. వారికి జీతాలు అందే విధంగా కృషి చేస్తా భట్టి హామీ ఇచ్చారు.