Madhya Pradesh Congress leader Kamal Nath: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆదివారం కమల్నాథ్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా పార్టీ అగ్రనాయకత్వం ఫోన్కాల్స్కు స్పందించకపోవడంతో.. ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తమ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆయనకు మద్దతు ఇస్తామని ఢిల్లీ బయల్దేరడానికి ముందు వీరంతా వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు కమల్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడరని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకుడన్నారు. కమల్ నాథ్ రాజకీయ ప్రయాణం మొదలైంది ఇక్కడేనని అన్నారు. పార్టీ ఆయనకు అన్ని రకాల పదవులు ఇచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన్ను మూడో కుమారుడిగా పేర్కొనేవారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ను వీడుతున్నారనడం ఊహాగానాలే నని దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేశారు.
గతేడాది చివర్లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకు పరిమితమైంది. దీనికి కమల్నాథ్ కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతోపాటు ఆయన కుమారుడు నకుల్ నాథ్ లోక్సభ అభ్యర్థిత్వంపై స్పష్టత లేకపోవడంతో శనివారం తండ్రీకుమారులు పార్టీ మారనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు పార్టీ మార్పు జరిగితే ముందుగా సమాచారం ఇస్తానని విలేకరులతో కమల్నాథ్ చెప్పడంతో ఆ వార్తకి మరింత బలం చేకూరింది. అయితే, కాంగ్రెస్ నాయకులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. మరోవైపు 66 మందిలో 23 మందిని తమతో తీసుకెళ్లేందుకు కమల్నాథ్ వర్గం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దానివల్ల పార్టీ ఫిరాంయిపుల చట్టం తమకు వర్తించదని భావిస్తున్నట్లు సమాచారం.