Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణను షేక్ చేస్తోంది. స్కాం జరిగింది ఢిల్లీలోనే అయినా.. వాటి మూలాలు తెలుగురాష్ట్రాల్లో ఉండటంతో ఈడీ, సీబీఐ ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. మద్యం దందాలో కీలక రోల్ ప్లే చేశారనే కారణంతో మరో ఇద్దరు తెలుగు వాళ్లను అరెస్ట్ చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేయగా.. లేటెస్ట్ గా అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ. ఆయనతో పాటుగా మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును సైతం అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి.
ఇప్పటికే సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీలో ప్రశ్నించారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంలో ఆయన ప్రమేయం ఉన్నట్టు తేలడంతో గురువారం అరెస్టు చేసింది.
ఢిల్లీ మద్యం దందాలో పలువురు తెలుగు వాళ్లు ఉండటం.. తెలంగాణ పాలిటిక్స్ లో కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు చెబుతున్నట్టు.. ఆ లింకులు ఎమ్మెల్సీ కవిత వైపు దారి తీస్తాయా? ప్రస్తుతం అరెస్టు అయిన వారికి కవితకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే టెన్షన్ క్రియేట్ అవుతోంది. అయితే, దర్యాప్తులో ఇప్పటి వరకైతే కవిత పేరు వినిపించలేదు. అవి కేవలం బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మాత్రమే. తమకేం సంబంధం లేదనేలా టీఆర్ఎస్ శ్రేణులు బయటకు బిందాస్ గా కనిపిస్తున్నా.. లోలోన ఏదో తెలీని గుబులు ఉందంటున్నారు.