TDP Leader Buddha Venkanna: నా దేవుడు.. నా ప్రాణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడునే అంటూ.. ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తన అభిమానం చాటుకున్నారు. చంద్రబాబు దేవుడంటూ కీర్తించిన బుద్ధా వెంకన్న.. ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు జిందాబాద్, నా ప్రాణం మీరే.. అంటూ రక్తంతో రాసి అధినేతపై అభిమానం చాటుకున్నారు.
అభిమానం ఉంటే పాలభిషేకం చేస్తారు. లేకపోతే పూలతో అభిషేకం చేస్తారు. కానీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఏకంగా రక్తంతోనే అభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే బుద్ధా వెంకన్న ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ టికెట్ను బుద్ధా వెంకన్న ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ టికెట్ను జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ సాధ్యం కాకపోతే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలంటున్నారు బుద్ధా వెంకన్న. ఇందుకోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఈ రకంగా రక్తంతో అభిషేకం చేశారని టాక్.
అయితే బుద్దా వెంకన్న మాత్రం చంద్రబాబు తనకు దేవుడితో సమానమనీ.. స్వామిభక్తిని నిరూపించుకునేందుకే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తనకంటే ఎక్కువ విధేయుడు ఎవరు ఉండరంటూ .. అన్ని అర్హతలు ఉన్న తనకు విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలంటున్నారు. లేదంటే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్నారు. అయితే సీటు విషయంలో తనది విన్నపం మాత్రమే అన్న బుద్దా వెంకన్న ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.
Read More: టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి..
మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా అధినేతను విమర్శించనని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబు రాజు అని .. తామంతా ఆయన సైనికులమని పేర్కొన్నారు.చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా పుట్టగతులు లేకుండా పోతారన్నారు. అయితే బుద్ధా వెంకన్న గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ కావాలని కోరుతున్నారు. సీటు ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమపోరాటం చేస్తానంటూ ఇటీవల బుద్దా వెంకన్న ప్రకటించారు. ఇప్పుడేమో ఏకంగా రక్తాభిషేకం చేశారు. అయితే సీటు ఇవ్వకుంటే విమర్శించను అంటూ బుద్ధా వెంకన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.