JP Nadda: సార్వత్రికల ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించింది. కాషాయ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ వరకు జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంటే సార్వత్రిక ఎన్నికల ముగిసే వరకు ఆయనే పార్టీ బాధ్యతలు మోయనున్నారు.
జేపీ నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కార్యవర్గం ఆయననే కొనసాగించాలని నిర్ణయించింది. జేపీ నడ్డా విజయోత్సాహాన్ని కొనసాగించేందుకు అధ్యక్ష పదవీ కాలాన్ని పొడిగించాలని సన్నాహాలు జరగుతున్నాయని అమిత్ షా ఆ సమయంలో తెలిపారు. తాజాగా కాషాయ పార్టీ జాతీయ కార్యవర్గం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది.
జేపీ నడ్డాకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను బీజేపీ కార్యవర్గం కల్పించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో వ్యక్తిగతంగానూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చింది. 2019 వరకు పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనే కాషాయ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు.
Read More: వికసిత్ భారత్ గ్యారంటీ నాదే.. ప్రధాని మోదీ హామీ..
ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మరో రెండు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహ రచన చేస్తోంది.
2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 161 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో 67 స్థానాల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. అలాగే ఎన్డీఏకు 400 సీట్లకుపైగా వస్తాయని నమ్మకంగా ఉన్నారు.