CM Revanth Reddy Speech(Political news in telangana): తెలంగాణ రాజధాని హైదరాబాద్ డెవలప్ మెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం .. గత 30 ఏళ్లలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కృషిని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం ముందుకు కెళుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు హయాంలో ప్రతిపాదించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్తో తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందేలా 2050 మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు.
అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజించి హైదరబాద్ ను అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫార్మా సిటీ నిర్మాణంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన డ్రగ్స్ తయారీ కంపెనీలు ఉండటం కరెక్ట్ కాదన్నారు. ఫార్మా కంపెనీలను సిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 10 నుంచి 15 గ్రామాల్లో ఫార్మా పరిశ్రమలు నిర్మించేలా చూస్తున్నామన్నారు. ఒకే చోట 25 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే నగరంలో పొల్యూషన్ పెరుగుతుందన్నారు.
Read More: కొడుక్కి పువ్వులు.. అల్లుడికి రాళ్లు.. వై కేసీఆర్?
నిర్మాణ సంస్థలతో చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తామే మేధావులమని భావించి నిర్ణయాలు తీసుకోబోమని తేల్చిచెప్పారు. అలా నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. పాలనపై తనకు కొంత సమయం కావాలని కోరారు. అధికారులు అవగాహన లేకుండా అనుమతులు ఇస్తే.. మాజీ హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 25 వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో
సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెట్రో విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారు.