VAIBHAV Fellowship Scheme : మన దేశాన్ని కలవరానికి గురి చేసే ప్రధాన అంశం మేధోవలస. ప్రతిభావంతులు విదేశాలకు తరలివెళ్తుంటే జరగే నష్టం అంతా ఇంతా కాదు. ఏటా 25 లక్షల మంది మంచి అవకాశాల కోసం దేశాన్ని వీడుతున్నారు. 2020 నాటికే ఇలా విదేశాలు చేరిన వారి సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలకే ఎక్కువ సంఖ్యలో చేరారు. ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించని కారణంగా 2016-20 మధ్య 6 లక్షల మంది భారతీయులు ఏకంగా తమ పౌరసత్వాన్నే త్యజించారు. మేధోవలసను కట్టడి చేసేందకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వైభవ్ అనే ఫెలోషిప్ పథకాన్ని కొత్తగా చేపట్టింది. ఇది సత్ఫలితాలనే ఇస్తోంది.
రివర్స్ మేధోవలస ఆరంభమైంది. దాదాపు 75 మంది భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో చేపట్టబోయే సైన్స్, టెక్నాలజీ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు సుముఖత తెలిపారు. తొలి బ్యాచ్గా 22 మందికి గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరంతా ఏప్రిల్ నాటికి వివిధ సంస్థల్లో చేరనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(DST) ప్రారంభించిన ఈ పథకానికి రూ.80 కోట్ల మేర నిధులు ప్రకటించారు. ఇండియాకు తిరిగి వచ్చే వారు ఏటా 1-2 నెలలు ఉండాలి. ఇలా గరిష్ఠంగా మూడేళ్ల పాటు అనుమతిస్తారు. ఏటా వారికి రూ.4 లక్షల చొప్పున గ్రాంట్ అందజేస్తారు.
సెలవుపై వచ్చి దేశంలో స్వల్పకాలం సేవలు అందించే ముందు మాతృ సంస్థ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఫెలోషిప్లో భాగంగా ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రెండు నెలల పాటు వసతి కూడా కల్పిస్తుంది. దేశంలో పరిశోధనల నిమిత్తం అయ్య ఖర్చు కోసం ఏటా లక్ష రూపాయలు అందజేస్తుంది. ఈ ఫెలోషిప్పై ఆసక్తి చూపుతున్న వారిలో అమెరికా, కెనడాల్లోని భారతీయులే ఎక్కువగా ఉన్నారు. నిరుడు తొలి దఫా 302 మంది నుంచి ప్రతిపాదనలు అందాయి. 22 ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్, మెడిసిన్ తదితర రంగాల్లోని శాస్త్రవేత్తలకు ఈ ఫెలోషిప్ అందుబాటులో ఉంది. అయితే ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వైపు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు