KCR first importance to KTR: ఒక పరాజయం గొప్ప అంతర్మథనానికి దారి తీస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అదే జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం నుంచి గులాబీ బాస్కు అన్నీ తానై వ్యవహరించిన, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి నిజమైన నాయకుడు హరీష్ రావును కాదని.. అమెరికా నుంచి వచ్చిన కుమారుడైన కేటీఆర్కు మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దుస్థితి దాపురించిందని గులాబీ శ్రేణులు లోలోన చర్చించుకుంటున్నాయి.
లోకంలో బిడ్డలను ప్రేమించని తల్లిదండ్రులు ఉండరు. త్రేతాయుగంలోని దశరథుడి దగ్గర నుంచి మహాభారతంలో దృతరాష్ట్రుడి దాకా.. ఎవరూ దీనికి అతీతులు కారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు మినహాయింపు కాదుగానీ.. ఈ విషయంలో కేసీఆర్ కాస్త గీత దాటారని సదరు నేతలు గొణుక్కుంటున్నారు.
తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి మేనల్లుడైన హరీష్ రావు పార్టీ నిర్వహణ, విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకుపోయి, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి అతి తక్కువ సమయంలోనే పార్టీ శ్రేణులకు పెద్ద దిక్కుగా నిలిచారు. పదునైన మాట, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. వారి మీద కేసులు పెడితే దగ్గరుండి విడిపించే వరకు అండగా నిలిచేవారు.
2004లో జరిగిన ఉపఎన్నికలో సిద్దిపేట నుంచి ఎన్నికైన హరీశ్.. వైఎస్ మంత్రి వర్గంలో యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. దీంతో పార్టీలో రెండవ స్థానం హరీశ్ రావుదేనని అందరూ అనుకునేవారు. కానీ.. 2004లో అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్.. రాజకీయాల్లోకి రావటంతో సీన్ మారింది. 2006 నాటి కరీంనగర్ ఎంపీ ఉపఎన్నికల వేళ, 2008లో గులాబీపార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కేటీఆర్కు ప్రధాన బాధ్యతలు అప్పజెప్పి.. సదరు క్రెడిట్ను కేటీఆర్కే దక్కేలా చేశాడు కేసీఆర్. దీంతో కేటీఆర్కు పార్టీలో ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది.
దీంతో హరీశ్ వర్గంలో అసంతృప్తి ఉన్నా.. సర్దుకుపోవాల్సి వచ్చింది. క్రమంగా హరీష్ను మెదక్ జిల్లాకే పరిమితం చేసి కేటీఆర్ ఇమేజ్ను జాతీయ స్థాయిలో పెంచే ప్రయత్నం జరిగింది. అయినా.. అయినా.. 2008 ఉపఎన్నికలో, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 నాటి ఉపఎన్నికల్లో, 2014, 2018, 2024 ఎన్నికల్లోనూ హరీశ్ గెలుస్తూనే వచ్చారు గానీ.. నంబర్ 2 అని మాత్రం అనిపించుకోలేకపోయారు.
ఇక.. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఏర్పడిన ప్రభుత్వంలో కేటీఆర్కు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ దక్కింది. ఆ మంత్రివర్గంలో హరీష్ రావుకు నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాల శాఖలు దక్కాయి. అయితే.. మంత్రిగా తన కేబినెట్లో కేటీఆర్కు తప్ప సీఎం కేసీఆర్ మరెవరికీ ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వలేదు. పేరుకు ఇరిగేషన్ మంత్రి అయినా..ప్రాజెక్టుల నిర్ణయాలన్నీ కేసీఆర్ నిర్ణయాల మేరకే జరిగాయి.
Read more: సై అంటే సై.. ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్!
2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికే హరీష్ రావు ప్రాధాన్యం తగ్గిందనే మాట వినిపించేది. సరిగ్గా ఆ ఎన్నికల ప్రచారం కోసం హరీష్ రావు హెలీకాఫ్టర్లలో జిల్లా పర్యటనలకు పూనుకున్నారు. కానీ.. కేసీఆర్ వెంటనే ఆ పని మానుకోవాలని సూచించటంతో హరీష్ అలిగారు. అయినా.. ఎవరూ ఆయనను బుజ్జగించకపోవటంతో హరీష్ దిగిరావాల్సి వచ్చింది. ఆ తర్వాత 2019 సెప్టెంబరు 8న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కొడుకుకు పాత 3 శాఖలూ కేటాయించిన కేసీఆర్… అల్లుడైన హరీష్ రావును కేవలం ఇరిగేషన్ శాఖకే పరిమితం చేశారు.
2015లో టీ హబ్ ప్రారంభం నుంచి ఆ తర్వాతి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు అన్నింటా కేటీఆర్ కనిపించేలా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. తన తర్వాతి స్థానమైన.. కార్యనిర్వాహక అధ్యక్ష పదవినీ కుమారుడికే కట్టబెట్టారు. తమ ప్రభుత్వ విజయాలన్నీ కుమారుడివే అనే వాతావరణాన్ని కల్పించారు. అయితే.. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
కేసీఆర్ సమక్షంలో 2024 ఎన్నికల ఫలితాల మీద జరిగిన చర్చ హరీష్, కేటీఆర్ మధ్య వాగ్వివాదానికి, అంతిమంగా ఘర్షణకు దారితీసిందని, ఈ ఘటనలోనే కేసీఆర్ కిందపడ్డారనే పుకార్లు కూడా వినిపించాయి. హడావుడిగా, అత్యంత రహస్యంగా గాయపడిన మాజీ సీఎంను యశోదా ఆసుపత్రికి తరలించటం, ఆయనను ఎవరూ చూసేందుకు అనుమతి ఇవ్వకపోవటం కూడా సదరు పుకార్లకు బలాన్ని చేకూర్చింది.
ఇక.. పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేతగా కేసీఆర్ ఎన్నికైనా నేటివరకు ఆయన అసెంబ్లీకి రాకపోవటంతో.. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల మీద జరిగిన చర్చలో హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించారు. గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ హరీష్ పాపాలే.. అంటూ అధికార పార్టీ నేతలు నిలదీస్తుంటే.. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిగా హరీష్ ఒక్కడే వాటికి జవాబివ్వాల్సి వచ్చింది. అదే సమయంలో కేటీఆర్ వెనక బెంచీలకే పరిమితమై రిలాక్స్ కావటం, పార్టీ ఎమ్మెల్యేలు సైతం హరీష్కు మద్దతుగా నిలబడి మాట్లాడే ప్రయత్నం చేయకపోవటంతో గులాబీ నేతలు ఇదేంటని గొణుక్కుంటున్నారు. ఇక హరీష్ అభిమానులైతే కొడుకును కాపాడుకునేందుకే గులాబీ బాస్.. సభకు రాకుండా తమ నేత హరీష్ను చిక్కుల్లో పెడుతున్నారా? ఇదేం న్యాయమంటూ లోలోన గొణుక్కుంటున్నారు.