Amit Shah Speech At BJP Convention: కేంద్రంలో మళ్లీ అధికారం తమదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ 3.0 ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో భారత మండపంలో బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మహాభారత యుద్ధంతో అమిత్ షా పోల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు.. ఫ్యామిలీ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని తెలిపారు. బీజేపీ గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని అమిత్ షా స్పష్టంచేశారు. దేశంలో ఉగ్రవాదం , నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని వివరించారు. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటుతో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని తేల్చిచెప్పారు.
మోదీ పేద ప్రజలు, దేశాభివృద్ధి కోసం ఆలోచిస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తమ వారసులను సీఎం, పీఎంలను చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. అలాంటి విధానాలు బీజేపీలో ఉంటే చాయ్వాలా కుమారుడు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదన్నారు.
Read More: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?
మోదీ ఓటమి కోసం రాకుమారులంతా ఏకమయ్యారని విపక్ష నేతలపై అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పైనా విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే హస్తం పార్టీ రామమందిర ప్రాణప్రతిష్ఠకు రాలేదని మండిపడ్డారు.