TSRTC Invites Tenders for Vacant Open Spaces: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్, సికింద్రాబాద్లలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్న ఖాళీస్థలాలను లీజుకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వ్యాపారాల నిమిత్తం స్థలాలు లీజుకు ఇచ్చేందుకు ఈ టెండర్లు ఆహ్వానించనుంది.
కొత్త బస్సుల కొనుగోలు కోసం చర్యలు మొదలు పెట్టిన టీఎస్ఆర్టీసీ అనేక ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అందులో భాగంగానే కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు రెడీ చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజనల్ పరిధిలో ఉన్న జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలో స్థలాలు, స్టాళ్లు, షాపులను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం వేరువేరుగా ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో కూడా టెండర్లను గతంలోనే పిలిచారు.
తాజాగా మరోసారి టీఎస్ఆర్టీసీ అధికారులు టెండర్ల దాఖలుకు ఆహ్వానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కాచిగూడ, మేడ్చల్, శామీర్పేట్, హకీంపేట్ వంటి ప్రధాన ప్రదేశాల్లో భూములు అందుబాటులో ఉన్నందున అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆ భూముల్లో అన్ని రకాల షాపులు, హోటళ్లు, పార్కింగ్, కార్గో పార్సిల్ సేవలు, ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్లు, షోరూమ్లు, ఇన్సిటి వేర్హౌస్లు ఏర్పాటు చేయాలనే నిబంధనలతో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతోంది.
Read More: జల దోపిడీ సహించం..!
కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్లో 2.83 ఎకరాలు, శామీర్పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.91 ఎకరాలు, రషీద్ గూడ 1లో 4.75 ఎకరాలు, రషీద్ గూడ 2లో 6.03 ఎకరాలు, తుర్కయాంజల్ 1లో 5.74 ఎకరాల భూములను తుర్కయాంజల్ 2లో 6.23 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X పోక్ట్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.
టెండర్ ప్రక్రియ, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆసక్తి ఉన్న వారు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ ని 9959224433లో సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. ఆసక్తి గల వారు ఆన్లైన్లో ఈ -టెండర్లను దాఖలు చేయడానికి చివరి తేది మార్చి15 2024గా నిర్ణయించారు. వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.