Swechha’ Investigation Team, Hyderabad:మొదటి కథనంతో సంచలనాలకు వేదికైంది ‘స్వేచ్ఛ’. 111 జీవో చాటున అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన డ్రీమ్ వ్యాలీ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ ఇచ్చిన ‘క్రైమ్ వ్యాలీ’ కథనంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పర్యావరణ వేత్తలు ‘స్వేచ్ఛ’ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులు స్పందిస్తూ.. కంచర్ల సంతోష్ రెడ్డి వ్యవహారాలపై ఫోకస్ చేసినట్టు స్పష్టం చేశారు. ‘స్వేచ్ఛ’ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
త్వరలోనే కూల్చివేతలు!
హైదరాబాద్ శివారులోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణకు, నగర శీతోష్ణస్థితిని కాపాడేందుకు 111 జీవోని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనివల్ల జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర నిర్మాణాలపై నిషేధం ఉండేది. 1994లో తొలుత జీవో 192ను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న జీవో 111ను తెచ్చింది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో 111ను రద్దు చేసింది. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థ నాశనానికి దారితీస్తుందని.. పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు అభ్యంతరం తెలిపారు. అయితే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. అలా, సంబరపడిన వాళ్లలో కంచర్ల సంతోష్ రెడ్డి ఒకరు.
Read more: ఇక.. బీఆర్ఎస్లో నంబరు 2 హరీషేనా?!
111 జీవో రద్దును పసిగట్టిన ఈయన ముందుగానే ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా 31 విల్లాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టి స్టింగ్ ఆపరేషన్ చేసింది ‘స్వేచ్చ’ ఇన్వెస్టిగేషన్ టీం. స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి లోపల జరుగుతున్న విల్లాల నిర్మాణాల పూర్తి సమాచారాన్ని సేకరించింది. ‘క్రైమ్ వ్యాలీ’ చట్టానికి తూట్లు.. కంచర్లకు కోట్లు పేరుతో కథనం ఇవ్వగా.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆర్డీవో, ఎమ్మార్వో, స్పెషల్ ఆఫీసర్స్ దీనిపై దృష్టి సారించారు. అసలు అనుమతులు అనే పదమే లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించారు. వాటిని అడ్డుకునేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని ‘స్వేచ్ఛ’ (బిగ్ టీవీ) కి స్పెషల్ ఆఫీసర్ గౌతమ్ కుమార్ తెలిపారు. రికార్డులు పరిశీలించి కూల్చివేతలు కూడా జరుపుతామని స్పష్టం చేశారు.
అడ్డుకున్న సర్పంచ్ లపై కేసులు
అజీజ్ నగర్, బాకారం గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అమలు సాధ్యం కాకపోగా కూల్చివేసేందుకు ప్రయత్నించిన గ్రామ సర్పంచులపై, సెక్రెటరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాకారం తాజా మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి పైన కేసులు నమోదు చేశారు. ఇలా అనేక అక్రమాలకు పాల్పడ్డవారి ఆటలు ఇక నుంచి సాగవు. చట్టాన్ని ఫాలో అవుతూ.. నిబంధనలతో కూడిన నిర్మాణాలు చేపట్టాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు రాబోయో వందేళ్ల వరకు సౌకర్యార్ధంగా నిర్మాణాలు కొనసాగించాలి. లేదంటే చర్యలు తప్పవు. ‘స్వేచ్ఛ’ చూస్తూ ఊరుకోదు.