Couple Suicide Due Credit Card Issues: తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లాలాపేట ప్రాంతానికి చెందిన రాగుల సురేశ్ (45), భాగ్య (40) దంపతులు ఫిబ్రవరి 18న బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేట ప్రాంతానికి చెందిన రాగుల సురేశ్ (45), భాగ్య (40) దంపతులు కొన్ని సంవత్సరాల కిందట బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లాలోని కీసరకు వచ్చి నివాసం ఉంటున్నారు.
దంపతులకు సౌషిక్ (17), భవన్ (15) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 3 సంవత్సరాల క్రితం సురేష్ దంపతులు టాటా క్రెడిట్ లిమిట్స్ అనే సంస్థ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని ఓ ప్లాట్ను కొనుగోలు చేశారు. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్న సురేష్ దంపతులు ఆరు నెలల క్రితం రాంపల్లిలోని ఆర్ఎల్నగర్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు.
Read More: మీరు వ్యాపారం చేయలనుకుంటున్నారా? ఐతే టీఎస్ఆర్టీసీ తరపున గుడ్న్యూస్..
ఈ తరుణంలో క్రెడిట్ కార్డు సంస్థకు అప్పులో కొంత డబ్బును కూడా చెల్లించారు. అయితే ఇంకా చెల్లించాల్సిన రుణం సుమారు రూ.3-4 లక్షలు ఉందని తెలిపారు. దీనితో క్రెడిట్ కార్డు సిబ్బంది పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు నెలలుగా తరచూ సురేశ్ నివాసానికి వెళారు. తాజాగా మరోసారి సురేశ్ నివాసానికి వచ్చిన క్రెడిట్ కార్డు సిబ్బంది బిల్లు చెల్లించడం లేదంటూ ఆ దంపతులను నానా ఇబ్బందులకు గురిచేశారు.
ఇక ఈ విషయం ఆ కాలనీవాసులకు తెలియడంతో తమ పరువుపోయిందని మనస్తాపానికి గురైన దంపతులు తమ పిల్లలను ఫిబ్రవరి 17న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించారు. మరుసటి రోజు భాగ్య పురుగుల మందు తాగగా సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న కీసర పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా.. తమ మరణానికి కారణం క్రెడిట్ కార్డు అధికారులని.. సురేష్ దంపతులు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. సూసైడ్ నోట్ ఆధారంగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.