Fire Accidents in Telangana : హైదరాబాద్ లోని కోఠి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ గల్లీలోని జేఎండీ ఎలక్ట్రానిక్స్ కు చెందిన సీసీటీవీ కెమెరాల గోదాంలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన సీసీ కెమెరాలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒక భవనంలోని ఎలక్ట్రానిక్ వస్తువులను నిల్వ ఉంచే.. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మొత్తం 3 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read More : ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. విద్యుత్ శాఖ కీలక ప్రకటన..!
నగరంలోని మరో ప్రాంతంలోనూ అగ్నిప్రమాదం జరిగింది. చందానగర్ లో ఒక సినిమా షూటింగ్ సెట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సినిమా షూటింగ్ సెట్ వెనుక ఉన్న చెత్తకుప్పలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.
మరోవైపు యాదాద్రి జిల్లాలోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలం హన్మాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.