India Vs England 3rd Test Day 3 Highlights: అందరూ కుర్రవాళ్లే, సీనియర్స్ ఎవరూ లేరు, రోహిత్ శర్మ ఒక్కడూ బండిని ఎలా లాగిస్తాడు..? అని మూడో టెస్ట్ ప్రారంభంలో అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే మొదటి ఇన్నింగ్స్ లో 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో టీమ్ ఇండియా పడిపోయింది.
ఈ పరిస్థితుల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో ఆదుకున్నారు. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా ఇంగ్లాండ్ 319 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు మొదలైంది అసలు కథ.
టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కుర్రాళ్లు, కుర్రాళ్లు అనుకున్న అందరి మైండ్ దిమ్మ తిరిగేలా యశస్వి బ్యాటింగ్ చేశాడు. తనకి అన్నివిధాల శుభ్ మన్ గిల్ సహాయ సహకారాలు అందించాడు. ఒక దశలో ఇద్దరూ జిడ్డు బ్యాటింగ్ తో విసిగించారు. ఓవర్ కి 2.5 చొప్పున రన్ రేట్ వచ్చింది. కనీసం 4 పరుగులైనా ఉండాలని కామెంటేటర్లు వ్యాక్యానించడం మొదలెట్టారు.
Read More : మూడో రోజు హీరో యశస్వి…: టీమ్ ఇండియా ఆధిక్యం 322
అప్పుడు యశస్వీ(Yashasvi Jaiswal) విధ్వంసకర ఇన్నింగ్స్ మొదలైంది. గేర్ మార్చాడు. టెస్ట్ మ్యాచ్ ని ఒక్కసారిగా టీ20 మోడ్ లోకి తీసుకొచ్చాడు. ఓ దశలో 73 బంతుల్లో 35 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పూనకం వచ్చినట్లుగా చెలరేగి పోయాడు. అండర్సన్ బౌలింగ్లో 6, 4, 4 కొట్టాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లీ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీ మార్క్ను సిక్సర్తో అందుకున్నాడు. 78 బాల్స్ లో ఆఫ్ సెంచరీ చేసిన జైశ్వాల్ తర్వాత 50 పరుగులు చేయడానికి కేవలం 44 బాల్స్ మాత్రమే తీసుకున్నాడు. మొత్తమ్మీద 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ఇలా టెస్టుల్లో వేగంగా మూడు సెంచరీలు సాధించిన ఏడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 13 ఇన్నింగ్స్లో జైస్వాల్ మూడు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్తో సరసన జైస్వాల్ చేరాడు.
అంతేకాదు ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభించాక తొలిటెస్ట్ లో 80 పరుగులతో ఆఫ్ సెంచరీ చేసిన యశస్వి, రెండో టెస్టులో డబుల్ సెంచరీతో మైమరిపించాడు. ఇప్పుడు మూడో టెస్టులో ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరి నాలుగో రోజు దీనిని కొనసాగించి డబుల్ సెంచరీ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.