cm kcr: సీఎం కేసీఆర్ చెప్పినట్టే జరిగింది. ఓ మంత్రి కంపెనీపై ఈడీ దాడులు జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ అధికారుల సోదాలు తెలంగాణలో తీవ్ర కలకలం రేపాయి. గ్రానైట్ సంస్థలే టార్గెట్ గా ఈ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్, కరీంనగర్ లోని పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై రైడ్స్ చేస్తున్నారు. విషయం తెలిసి హుటాహుటిన దుబాయ్ నుంచి తిరిగొచ్చేశారు మంత్రి గంగుల. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. రాష్ట్ర పరిధిలోని అంశంలోకి ఈడీ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ తెలంగాణలో సోదాలతో కలకలం రేపాయి జాతీయ విచారణ సంస్థలు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత ప్రమేయం ఉందనేది బీజేపీ ఆరోపణ. అదే నిజమైతే కవిత టార్గెట్ గానే లిక్కర్ స్కాంలో దూకుడుగా దర్యాప్తు జరుగుతోందనే అనుమానం. ఓ నిందితుడిని అప్రూవర్ గా మార్చడం ఎవరికి ఉచ్చు బిగించేందుకు? ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకా? లేదంటే…?
ఇటీవల సీఎం కేసీఆర్ పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై పగ పట్టిందని.. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందంటూ నేతలను అలర్ట్ చేశారు. మంత్రులంతా అతిజాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి పొరబాట్లు జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ చెప్పినట్టుగానే.. కొన్నివారాల్లోనే.. మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీ రైడ్స్ జరగడం ఆసక్తి రేపుతోంది.
ఈడీ, బోడీ.. తమనేమీ చేయలేదంటూ.. దమ్ముంటే రమ్మంటూ.. కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే సవాల్ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలేమో కేసీఆర్ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని వార్నింగులు ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్ తో రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ సంస్థలపై ఈడీ, ఐటీ రైడ్స్ జరగడాన్ని కాకతాళీయంగా చూడలేమంటున్నారు.