Ind vs Eng 3rd Test Update(Latest sports news today): మహ్మద్ సిరాజ్ ని అందరూ సాధారణ ఫాస్ట్ బౌలర్ గానే చూస్తారు. కానీ తనదైన రోజున మాత్రం తనకి తిరుగుండదు. అశ్విన్ లేకపోవడంతో నలుగురితో బౌలింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు సిరాజ్ ఊపిరిపోశాడు. బుల్లెట్ లాంటి యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్ల స్టంప్స్ ఎగరగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ 20 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో 6 వికెట్లతో చేసిన సంచలనం మళ్లీ రాజ్ కోట్ లో సిరాజ్ రిపీట్ చేశాడు. ఇంగ్లాండ్ పటిష్టమైన స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించింది. వారి తీరు చూస్తే కనీసం 500 పరుగులైన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారి ఆలోచనలన్నీ మహ్మద్ సిరాజ్ తలకిందులు చేశాడు.
రెండో టెస్ట్ లో బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకుంటే, మూడో టెస్ట్ లో ఆ పాత్రను మహ్మద్ సిరాజ్ తీసుకున్నాడు. అద్భుతమైన యార్కర్లు వేసి ఇంగ్లాండ్ ను మడతెట్టేసేడు. తను వేసిన బౌలింగ్ ని చూసి ఇంగ్లీషు బ్యాటర్ల మతి పోయింది. ముఖ్యంగా సిరాజ్ వేసిన స్టన్నింగ్ యార్కర్లకు ఇంగ్లండ్ టెయిలెండర్స్ రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1) స్టన్ అయిపోయారు. రెహాన్ అహ్మద్ అయితే ఎలా ఔటయ్యాననేది అర్థం కాక అయోమయంతో క్రీజులోనే కాసేపు ఉండిపోయాడు.
మ్యాచ్ లో 70వ ఓవర్ ప్రారంభమైంది. సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. నాలుగు బంతులు మాములుగానే పడ్డాయి. కానీ ఐదో బంతిని మాత్రం యార్కర్గా సంధించాడు. దానిని రెహాన్ అహ్మద్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ సిరాజ్ వేసిన వేగానికి బ్యాట్ అడ్డు పెట్టినా సరే, కింది నుంచి తాకుతూ అంతే స్పీడుగా వెళ్లి ఆఫ్ స్టంప్ను ఎగరగొట్టింది. అయితే తను బ్యాట్ అడ్డుపెట్టినా సరే, బాల్ ఎలా వెళ్లిందనేది రెహాన్ కు అంతు చిక్కలేదు. తర్వాత ఓవర్ తొలి బంతికి ఇదే తరహా యార్కర్ వేశాడు. దాంతో అండర్సన్(1)ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.