Arvind Kejriwal Wins Confidence Motion: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష (Confidence Motion)లో గెలుపొందారు. ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా.. నేడు దానికి సంభందించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఓటింగ్ సందర్భంగా 64 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 54 మంది సభకు హాజరయ్యారు. అనంతరం జరిగిన ఓటింగ్లో మెజరటీ ఓటుతో కేజ్రీవాల్ సభా విశ్వాసం పొందారు.
దీనికి ముందు చర్చలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సభలో తమ పార్టీకి మెజారిటీ ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుండటంతో విశ్వాస తీర్మానానికి వెళ్లామని తెలిపారు. బీజేపీ ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో గెలిచినా 2029 ఎన్నికల్లో బీజేపీని నుంచి దేశానికి తమ పార్టీ విముక్తి కల్పిస్తుందని సవాలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ ఫిరాయింపులకు పాల్పడలేదని, ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరికి ఆరోగ్యం బాగోలేదని, మరికొందరు ఢిల్లీలో లేరని చెప్పారు. అరెస్టుల ద్వారా ఆప్కు చరమగీతం పాడాలని బీజేపీ ఆలోచనగా ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టయితే పార్టీ కుప్పకూలుతుందని వారి అంచనాగా ఉందని, కేజ్రీవాల్ను అరెస్టు చేయవచ్చునేమో కానీ కేజ్రీవాల్ ఐడియాలజీని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
ఎవరైనా బీజేపీ ఒత్తిడికి లోనై ఆ పార్టీలో చేరితే వారు అవినీతిపరులే అని, ఆ ఒత్తిడి ఎదుర్కొన్న వారే నిజాయతీపరులని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో 30 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో 15 ఏళ్లు, యూపీలో 10 ఏళ్లుగా కమలం పార్టీ ప్రభుత్వం నడుస్తోందని, ముందు ఈ రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అందించాలని సవాలు చేశారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఇవన్నీ చేసిందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ మేం రాముడి భక్తులమని చెప్తోందే కానీ ఢిల్లీ ఆసుపత్రుల్లో పేదలకు మందులు నిలిపివేశారని మండి పడ్డారు. ‘అయినా మీ శత్రుత్వం నాతో. ఢిల్లీ ప్రజల్ని ఎందుకు లాగుతారు? నా హృదయం ద్రవించిపోతోంది’ అంటూ కేజ్రీవాల్ ఉద్వేగంగా మాట్లాడారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈడీ చేసిన ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణకు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.