Strict Rules For NRI Marriages: విదేశాల్లో స్థిరపడిన మన దేశ పౌరులు.. భారతీయులను పెళ్లి చేసుకోవాలంటే ఇక నుంచి కొన్ని కఠినమైన నిబంధనలను కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సూచనలు జారీ చేసింది. ఎన్నారైల పెళ్లిళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాని సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో లా కమిషన్ సిఫార్సులు ఇచ్చింది. ఇక నుంచి ఎన్నారైలు భారత్కు వచ్చి.. ఇక్కడి వారిని వివాహం చేసుకోవాలంటే కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది.
భారతీయ పౌరులను ఎన్నారైలు పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నారైల వివాహాలపై సూచనలు ఇవ్వాలని లా కమిషన్ను కేంద్రం ఆదేశించింది. దీంతో సమగ్ర విచారణ జరిపిన లా కమిషన్ తాజాగా కీలక సిఫార్సులు జారీ చేసింది. ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి రూపొందించనున్న కొత్త చట్టానికి లా కమిషన్ కీలక నిబంధనలను అందించింది. దీంతో ఇకపై ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకోవాలంటే అన్ని రకాల నిబంధనలను పాటించాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read More: కాంగ్రెస్కు షాక్ తప్పదా? హింట్ ఇచ్చిన కమల్నాథ్ కుమారుడు..
ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని లా కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు లా కమిషన్ ఈ సమస్యలపై సమగ్ర చట్టం పేరిట కీలకమైన సిఫార్సుల నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందించింది. రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ ఈ ప్రతిపాదిత చట్టం సంపూర్ణంగా, సమగ్రంగా ఉండాలని కేంద్రానికి సూచించింది. ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాలకు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు రాసిన లేఖలో జస్టిస్ రీతు రాజ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయులను పెళ్లి చేసుకొని ఎన్నారైలు మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారైలు తమ భార్యలను పెళ్లి తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. అయితే కొత్తగా తీసుకురానున్న కఠిన చట్టాన్ని కేవలం ఎన్నారైలకు మాత్రమే కాకుండా భారత పౌరులకు కూడా వర్తింపజేయాలని జస్టిస్ రీతు రాజ్ అవస్తీ లా కమీషన్కు సూచించారు.
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (Non-Resident Indians-NRI) ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్స్-ఓసీఐ (Overseas Citizenship of Indians-OCI)లతో భారత పౌరులకు జరిగే వివాహాలను భారత్లో రిజిస్టర్ తప్పనిసరిగా చేయాలని లా కమిషన్ తెలిపింది. ఈ నేపధ్యంలోనే కొత్తగా రూపొందించే చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలని తెలిపింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు జారీ చేయడం, నోటీసులు పంపించడానికి సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టంగా పేర్కొనాలని లా కమీషన్ సూచించింది.
1967 పాస్పోర్ట్ చట్టానికి కొన్ని మార్పులు చేసింది. పెళ్లి చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పేర్కొంది. దీంతోపాటు భార్యాభర్తల రెండు పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా కొత్త రూల్ తీసుకురావాలని సూచింది. భార్యాభర్తలు ఇద్దరి పాస్పోర్ట్లపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండేలా చూడాలని తెలిపింది. వివాహ నమోదు సంఖ్య ఎన్నారైల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుందని లా కమీషన్ వెల్లడించింది. భార్యభర్తల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలని, దీంతో పాటు ఈ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది.