Madhya Pradesh former CM Kamal Nath son Nakul: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ కి గుడ్బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు, ఎంపీ నకుల్ నాథ్ తన అన్ని సోషల్ మీడియా ఖాతాల బయోల్లో ‘కాంగ్రెస్’ అనే పదాన్ని తొలగించడం వైరల్ అవుతుంది. అటు కమల్నాథ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
నకుల్ తన తండ్రితో కలిసి త్వరలోనే బీజేపీల చేరనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన బయో నుంచి ‘కాంగ్రెస్’ను తీసివేయడం.. పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కాంగ్రెస్ నేతలకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చకు దారితీస్తోంది.
కమల్ నాథ్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలపై వీడీ శర్మ శుక్రవారం స్పందించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిందన్నారు. ఈ నిర్ణయంతో ఆ పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని బాధపడ్డారన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Read more: మద్యం కేసులో ఈడీ ఫిర్యాదు.. కోర్టుకు వర్చువల్గా హాజరైన కేజ్రీవాల్..
నకుల్ నాథ్ మధ్యప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఛింద్వాడా స్థానం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీనిపై పార్టీ నుంచి అధికారిక స్పందన రాలేదు. నకుల్ పార్టీని వీడితే అది కాంగ్రెస్కు గట్టి దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కమల్నాథ్ కుటుంబానికి ఛింద్వాడా కంచుకోట లాంటిదన్నారు. ఇక్కడి నుంచి వరుసగా తొమ్మిదిసార్లు వీరి కుటుంబసభ్యులే నెగ్గారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలోని 28 స్థానాలను కైవసం చేసుకోగా.. మిగిలిన ఛింద్వాడాలో మాత్రం నకుల్ విజయం సాధించారు.