White Paper on Medigadda : శ్వేతపత్రమంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. దానిపై హరీష్ రావు మాట్లాడుతూ.. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. శ్వేత పత్రంలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. రూ.775 కోట్ల వ్యయంతో మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తామే పూర్తి చేశామన్నారు.
అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కూడా తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని హరీష్ రావు సభలో సభ్యులకు తెలిపారు. కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ ను గతంలోనే తాము వ్యతిరేకించామన్నారు. అన్నీ అసత్యాలే చెప్పి.. గత ప్రభుత్వంపై బురదచల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
Read More : సామాజిక సాధికారతకే బీసీ కులగణన..!
ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద మేటర్ అని.. ఇరిగేషన్ పై పూర్తిగా చర్చించేందుకు కనీసం 2 గంటల సమయమైనా కావాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఉత్తమ్.. హరీష్ రావు చెప్పిందే పదే పదే చెబుతారని దుయ్యబట్టారు. కేసీఆర్ – జగన్ చాలాసార్లు నీటివాటాలపై చర్చించారని, అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెప్పి ఉంటే.. రాయలసీమ ప్రాజెక్టు ఆగేదన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని యద్దేవా చేశారు. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువుగా బీటలు వారడాన్ని చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ సమర్థించుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కాళేశ్వరం కింద కట్టిన మేడిగడ్డతో పాటు.. మరో రెండు ప్రాజెక్టుల్లోనూ నాణ్యత లేదని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందన్నారు.