Helicopter Services in Medaram Jatara(Telangana news updates): మేడారం సమ్మక్క సారక్క జాతరలో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు మహాజాతర నేపథ్యంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో.. బెంగళూర్కు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ భక్తులకు హెలికాప్టర్ సేవలను అందించనుంది. అయితే గత 2 జాతరలతో పోలిస్తే ధరలు పెంచడంతో.. తగ్గించే విషయంపై అధికారులు చర్చిస్తున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 2010లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొదటగా టర్బో ఏవియేషన్ ఆధ్వర్యంలో మామునూర్ ఎయిర్ పోర్ట్ నుంచి వీటిని నడిపారు. 2018 జాతరకు వచ్చేసరికి మరో 2 సంస్థలు రంగంలోకి దిగాయి.అయితే 2020,2022 వచ్చేసరికి కరోనా కారణంగా ఒకే సంస్థ ముందుకొచ్చింది. ఈ సారి కూడా ఒకే హెలికాప్టర్ ద్వారా సేవలు అందించనున్నారు.
Read More : చట్టానికి తూట్లు.. కంచర్లకు కోట్లు..!
తుంబి ఏవియేషన్ సంస్థ అందిస్తున్న హెలికాప్టర్ సేవల్లో ప్రధానంగా జాయ్ రైడ్ పేరుతో.. జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడ్ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్క నుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీనికోసం ఒక్కొక్కరి నుంచి 4800 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇక షటిల్ సర్వీస్ పేరుతో హనుమకొండ నుండి మేడారం జాతరకు మరో జర్నీ ఉంటుంది. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలుంది. ఇందులో ఒక్కొకరికి రానుపోను రూ.29 వేలు తీసుకుంటారు. ఇందులో భాగంగా స్పెషల్ పాస్ ఇస్తారు. దీంతో అమ్మవారి గద్దెల వద్ద వీవీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
2022లో హనుమకొండ నుంచి మేడారం రైడ్కు ఒక్కొకరికి 20 వేల రూపాయలు టికెట్ పెట్టారు. జాతరలో ఏరియల్ వ్యూ, జాయ్రైడ్ కోసం ధర రూ.3,700గా నిర్ణయించారు. అయితే తుంబి ఏవియేషన్ సంస్థ ప్రస్తుతం ధరలను మరింత పెంచింది. హనుమకొండ నుంచి 29వేల రూపాయలు, మేడారం లోకల్ జాయ్ రైడ్ అయితే 4,800 రూపాయలతో అధికారులకు వారం కింద కొటేషన్ ఇచ్చింది. పెరిగిన హెలికాప్టర్ ఫ్యూయల్ ధరల వల్లే రేట్లు పెంచామని తుంబి ఏయిర్వేస్ ప్రతినిధులు చెబుతున్నారు. పెరిగిన ధరలు భక్తులకు ఇబ్బంది కలిగేలా ఉన్నాయని టూరిజం అధికారులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. పెంచిన ధరల్లో ఎంతో కొంత తగ్గించేలా చూసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.